హైదరాబాద్ మెట్రోలో పాము .. టికెట్ లేకుండానే 8 ట్రిప్పులు .. కంగారుపడ్డ జనం
హైదరాబాద్ : మెట్రో రైళ్లు ప్రయాణీకుల కోసమే కాదు పాముల కోసం కూడా. అవును మీరు విన్నది నిజమే. మోడరన్ టెక్నాలజీతో రూపొందించిందిన మెట్రోలో ప్యాసెంజర్స్ తప్ప చీమైనా దూరవు అని చెప్తుంటారు. కానీ ఏకంగా ఓ పాము దూరింది. అదీ కూడా డ్రైవర్ క్యాబిన్లో రాజసం ఒలకబోసింది. ఒకటి కాదు రెండు కాదు ఐదురోజులు అక్కడే ఉండి .. మెట్రో సిబ్బందికి చల్లని ఏసీ గాలిలో ముచ్చెమటలు పట్టించింది.
మెట్రోలోకి పాము
మెట్రో .. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు. అక్కడి సిబ్బంది అనుమతి లేనిది చీమైనా లోపలికి దూరదు. దూరేందుకు అవకాశం కూడా లేదు. కానీ భాగ్యనగరానికి మణిహారంగా మారిన మెట్రోలో పాము కలకలం రేపింది. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఐదురోజులు మెట్రో డ్రైవర్ క్యాబిన్లో ఉండిపోయింది. సాధారణంగా మెట్రో ట్రైన్ ప్రతి డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. అలాంటి మెట్రోలోకి పాము చొరబడటం అంటే అంత ఈజీ కాదు. కానీ ఏకంగా ఈ నెల 14న ఎల్బీనగర్ నుంచి బయల్దేరిన మెట్రోలోకి పాము చొరబడింది. అప్పటికే డోర్లు క్లోజ్ చేసి ఉండటంతో తరిమికొట్టే సాహసం చేయలేదు. ఆ సమయంలో ట్రైన్ నడుస్తోంది. ఒకవేళ పామును కొడతామని అనుకుంటే .. మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణీకులు భయపడతారని మదనపడ్డారు. వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్కేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు.
కనిపించి .. మాయం ....
మెట్రో డ్రైవర్ సమాచారంతో వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులు రంగంలోకి దిగారు. మెట్రో డ్రైవర్ క్యాబిన్ను పరిశీలించారు. కానీ పాము జాడ కనిపించలేదు. అణువణువూ పరిశీలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ పాము ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని భావించారు. ఇక అప్పటినుంచి ఆ మెట్రో నిరంతరాయంగా తిరుగుతూనే ఉంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రోజుకు 80 ట్రిప్పుల చొప్పు తిరిగింది. అంటే ఐదురోజుల లెక్కన 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కానీ నిన్న ఆ పసర పాము మళ్లీ దర్శనమిచ్చింది. మెట్రో రైలు దిల్సుఖ్నగర్ చేరుకోగానే పాము కనిపించింది. వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి .. దానిని పట్టుకున్నారు. దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తర్వాత వారు అడవీలో వదిలేశారు. ఇది పసర పాము అని .. దీంతో ప్రాణాపాయం ఏమీ జరగదని స్నేక్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు.
హమ్మయ్య ..
ఆ పసర పాము ఐదురోజులు ఎక్కడ ఉంది అనే ప్రశ్న సశేషంగా మిగిలింది. రైలు ఇంజిన్కు చుట్టుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకోసమే గత 5 రోజులుగా పాము కనిపించడం లేదని తెలిపారు. మొత్తానికి స్నేక్ సొసైటీ సభ్యులు పాముని పట్టుకొని ..మెట్రో డ్రైవర్కు స్వాంతన చేకూర్చారు.