మిషన్ భగీరథ పైప్లో పాము..! వణికిపోయిన గ్రామస్థులు..!!
చేవెళ్ల/ హైదరాబాద్ : ఎక్కడైనా పాములు కోళ్లను కమ్మేసే గంపల్లోనో, పౌల్ట్రీ ఫామ్స్ లోనో అంతగా కాకపోతే ఇళ్లల్లోనో దూరి హంగామా చేస్తుంటాయి. స్నేక్ టేకర్స్ ని పిలిపించి ఆ పామును పట్టించేంత వరకు నిద్రాహారాలు ఉండవు. అప్పుడప్పుడు ఇలా ఇళ్లల్లో తళుక్కుమని ప్రజలను ఊపిరి పీల్చకుండా చేసే పాములు తాజాగా అరుదైన ఫీట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. చేవెళ్ల సమీప గ్రామంలో ఓ పాము దూరకూడని ప్రదేశంలో దూరి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పైప్లైన్లో పాము వచ్చిన సంఘటన మల్కాపూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మల్కా పూర్ నెలరోజుల నుంచి అధికారులు మిషన్ భగీరథ పైప్ల ద్వారా తాగునీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. రోజుమాదిరిగానే మంగళ వారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాగునీటిని వదిలారు.
అసలు ట్విస్టు ఇక్కడే కనిపించింది. బిందెడు నీళ్లు పట్టుకుందామని వచ్చిన వారికి మూడు చెరువుల నీళ్లు తాగించింది ఆ పాము.నీటిని పట్టుకుంటున్న సమయంలో గ్రామంలోని సద్దుల నర్సింహులు ఇంటి సమీంపలోని గేట్వాల్ తెరుచుకుని ఉండటంతో నీళ్ల వేగానికి పాము పైప్ పైకి వచ్చింది. ఇది గమనించిన నర్సింహులు కుటుంబ సభ్యులు పాము అంటూ పరుగులు తీశారు. చుట్టుపక్కలవారు వచ్చి పామును కర్రతో బయటకు తీశారు. అప్పటికే అది చనిపోయి ఉండటంతో అక్కడివారు ఊపీరి పిల్చుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులు సంబంధితశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని పామును దూరంగా పడవేశారు. అయితే మిషన్ భగీరథ నీటిని చాలా మంది తాగుడంతో ఏం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ పైప్లో పాము వచ్చిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావ్రుత్తం కాకుండా అదికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.