తెలివి మీరారు: పట్టుకోబోయిన పోలీస్, ఆయన స్కూటర్తోనే పరారైన స్నాచర్లు
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నా... ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా సోమవారం ఎల్బీ నగర్ పరిధిలో ఓ గోలుసు దొంగతనానికి యత్నించి త్రుటిలో తప్పించుకుని పోయిన దొంగల వ్వవహార శైలికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
రెండేళ్ల క్రితం నారాయణగూడలో దొంగతనం చేసిన బజాజ్ పల్సర్ వాహనంతోనే దుండగులు ఇన్ని రోజులు చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం జరిగిన చోరీ ఘటనలో ప్రాథమిక ఆధారాలను బట్టి దుండుగలను పాతబస్తీకి చెందిన వారీగా గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.
వివరాల్లోకి వెళితే... బైరామల్గూడ చెరువు కట్ట వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు దుండగులను సోమవారం మధ్యాహ్నం సరూర్నగర్ కానిస్టేబుల్ సమ్మయ్య అడ్డుకున్నారు. అయితే అతడు దుండగులను నిలువరించేందుకు ప్రయత్నించినా, స్థానికుల సహకారం లేకపోవడంతో వారు పారిపోయారు.
ఈ క్రమంలో దుండగులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో కానిస్టేబుల్ సమ్మయ్య దుండగులు తాళం చెవి లాక్కోవడంతో వారు సమ్మయ్య వాహనంపై ఉడాయించారు. దీంతో చైన్ స్నాచింగ్కు పాల్పడున్న దుండగులను పట్టుకునేందుకు సమ్మయ్య చూపిన తెగువను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రశంసించి పారితోషికాన్ని ప్రకటించారు.
ఘటనాస్థలిలో దుండగులు పారిపోతూ వదిలేసిన బజాజ్ పల్సర్ వాహనం గతంలో చోరీకి గురైనదని పోలీసులు పది నిమిషాల్లోనే గుర్తించగలిగారు. వాహనం నంబరు(ఏపీ 25ఏం 0642) ఆధారంగా వివరాల్ని ఆర్టీఏ డేటాబేస్లో తనిఖీ చేయగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన బెల్దారి శ్రీకాంత్గా గుర్తించారు.
దీంతో అతడిని ఆరా తీయగా 2014 జూన్ 13న తన వాహనం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు తెలిపాడు. ఈమేరకు స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసినట్లు వెల్లడించడంతోపాటు పోలీసుల రికార్డుల్లోనూ వాహనం చోరీ అయినట్లు నమోదై ఉండటంతో ఘాతుకానికి పాల్పడిన దుండగులే అపహరించారని నిర్ధారణకు వచ్చి పోలీసులు వారికోసం గాలింపు మొదలుపెట్టారు.
అంతేకాదు ఈ పల్సర్ వాహనంపై గత ఏడాది జూలై 17 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఉల్లంఘనకు కూడా దుండగులు పాల్పడ్డారు. వీటిలో రెండు తప్పుడు మార్గంలో వాహనం నడపగా, మరపో రెండు హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై ఉల్లంఘనలు(రూ.675) నమోదయ్యాయి.
వీటిలో నాలుగు ఉల్లంఘనలు పాతబస్తీ ప్రాంతంలోనివే కావడంతో దుండగులు అక్కడివారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ఠాణా పరిధిలో మూడు, ఫలక్నుమా పరిధిలో ఒక ఉల్లంఘన ఉంది. దీంతో తాజా ఘటనను బట్టి చూస్తుంటే పోలీసుల నిఘా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది.
నగరంలో దొంగిలించిన వాహనంతోనే దుండగులు ఇక్కడే సంచరిస్తూ పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా పోలీసులు గుర్తించకపోవడం విస్మయం గొలుపుతోంది.