‘స్నేహామృత’మే: అవయవదానంతో 10మంది ప్రాణం నిలిపింది
హైదరాబాద్: ఓ యువతి తాను తనువు చాలించి పది మందికి ప్రాణదానం చేసిన ఘటన నగరంలోని ఏఎస్రావునగర్ పరిధిలోని అరుల్కాలనీలో చోటు చేసుకుంది. పది మంది ప్రాణాలను నిలబెట్టిన ఆ యువతి పేరు బొబ్బా స్నేహామృత (21).
వివరాల్లోకి వెళితే.. ఏఎస్రావునగర్ అరుల్ కాలనీకి చెందిన డి దిలీప్కుమార్ ఓ ఐటీ కంపెనీలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్యే స్నేహామృత(21). ప్రస్తుతం ఆమె ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సర చదువుతోంది. వినాయకచవితి సందర్భంగా కర్ణాటక.. రాయచూర్లోని అత్తగారి ఇంటికి వెళ్లారు.
కాగా, సెప్టెంబర్ 3న పండుగ సామగ్రి తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో స్నేహామృత తీవ్రంగా గాయపడగా.. భర్తకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే స్నేహామృతను రాయ్చూర్లోని బాలంకూ ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడి నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా సెప్టెంబర్ 6న బ్రెయిన్డెడ్ అయిందని న్యూరో సర్జన్ నిర్ధారించారు. సమాచారాన్ని జీవన్దాన్ ప్రతినిధులకు అందించగా, వారు కుటుంబసభ్యులను కలిసి అవయవదానంపై ఒప్పించారు. దీంతో కాలేయం, మూత్ర పిండాలను సేకరించారు. కాగా, కుషాయిగూడ శ్మశానవాటికలో బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.
ఇది ఇలా ఉండగా, మరో ఘటనలో తిరుమలగిరికి చెందిన సంతోశ్ జోషి (56) ఓ సంగీత శిక్షకుడు. అతనికి భార్య కల్పనా జోషి, కుమారుడు అరుణ్ జోషి ఉన్నారు. సెప్టెంబర్ 2న తిరుమలగిరి వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన సంతోశ్ను స్థానిక నవజీవన్ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం లోయర్ ట్యాంక్బండ్ వద్ద ఉన్న సాయివాణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సెప్టెంబర్ 3న చికిత్స పొందుతుండగానే బ్రెయిన్డెడ్కు గురైనట్లు ఆస్పత్రి న్యూరో సర్జన్ నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో సమాచారాన్ని జీవన్దాన్ ప్రతినిధులకు అందించారు. దీంతో సంతోశ్ శరీరం నుంచి కాలేయం, మూత్రపిండాలు, కళ్లు సేకరించారు. ఈ సందర్భంగా జీవన్దాన్ ప్రతినిధులు సంతోశ్ కుటుంబ సభ్యులను అభినందించారు.