శిరీష మరణం వెనుక మిస్టరీ.. డిజిపికి లేఖ: ఎక్కడో చంపి.. ఇక్కడే ఇన్ని అనుమానాలు?
ఫిలింనగర్లో చోటు చేసుకున్న బ్యూటీషియన్ ఆత్మహత్యపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కుకునూరుపల్లి ఎస్సైతో లింక్ పెట్టడాన్ని రెండు కుటుంబాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: ఫిలింనగర్లో చోటు చేసుకున్న బ్యూటీషియన్ ఆత్మహత్యపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కుకునూరుపల్లి ఎస్సైతో లింక్ పెట్టడాన్ని రెండు కుటుంబాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: స్టూడియోలో శిరీష-రాజీవ్ భార్యాభర్తల్లా.., విస్తుపోయే నిజాలు..
శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తల్లిదండ్రులు, భర్త ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్య కోణంలో దర్యాఫ్తు చేపట్టాలని పోలీసు శాఖకు వినతులు వస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విచారణలో లోపాలను ఎత్తిచూపుతూ కేసును మళ్లీ విచారించాలని డిజిపికి పలువురు లేఖ రాశారని చెబుతున్నారు. ఆమెది ఆత్మహత్య అని ఏ ప్రాతిపదికన నిర్ధారణకు వచ్చారని, ఫోరెన్సిక్ నివేదికలు ఎక్కడ అని ప్రశ్నలు వేస్తున్నారు.
ఎన్నో అనుమానాలు
శిరీష విషయంలో ఆమె తల్లి వ్యక్తం చేసిన అనుమానాలను పలువురు వ్యక్తం చేశారంటున్నారు. ఆరు అడుగుల ఎత్తు, దాదాపు 75 కిలోల బరువు ఉన్న శిరీష ఫ్యాన్కు ఉరి వేసుకుంటే మోటార్ భాగం లేదా సీలింగ్ చేర్చిన ఇనుప పైపులు ఎందుకు వంగలేదని, కేసులో ఫ్యాన్ బాగా ఉందని అంటున్నారు. అలాగే, శిరీష మెడలో గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలిందంటున్నారని, కానీ ఉరి వేసుకుంటే మెడలోని చిన్న పాటి ఎముకలు ఎందుకు విరగలేదని ప్రశ్నిస్తున్నారు.
రాజీవ్ తలుపులు బద్దలు కొడితే... ఇక్కడే మరో అనుమానం
శిరీష లోపలకు వెళ్లి గడియ వేసుకున్నప్పుడు రాజీవ్ తలుపులు బలంగా కొట్టాడని చెబుతున్నారని, మరి చుట్టుపక్కల వారికి ఎందుకు వినిపించలేదని, ఇది అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. స్టూడియోకు వచ్చాక వేకువజామున 3.54 గంటలకు శిరీష తన ఫోన్ నుంచి రాజీవ్కు వీడియో కాల్ చేసింది. తిరిగి రాజీవ్ ఆమెకు 4.03 గంటలకు చేశాడు. ఆ మధ్య ఆమె భర్తకు ఎందుకు ఫోన్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కుకునూరుపల్లిలో, కారులో వారితో తప్పించుకునేందుకు పోరాడిన శిరీష.. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని అంటున్నారు.
దీనిని భర్తకు ఎందుకు పంపించలేదు
కుకునూరుపల్లి వెళ్లే సమయంలో భర్తకు లొకేషన్ పంపించిన శిరీష.. పోలీసు క్వార్టర్సులో తనపై జరిగిన దాడిని ఎందుకు పంపించలేకపోయారని, అలాగే తనపై అఘాయిత్యాన్ని భర్తకు ఎందుకు తెలియజేయలేకపోయిందని అంటున్నారు.
ఎక్కడో చంపేసి ఉంటారని..
కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్సులో ఎస్సై అఘాయిత్యం చేయబోతే ధైర్యంగా కేకలు వేసింది. తనతోనే ఉండాలని రాజీవ్కు మెసేజ్ పెట్టింది. కారు నుంచి దూకేందుకు ప్రయత్నించిందని అంటున్నారు. కానీ హైదరాబాద్ వచ్చాక ఇంటికి వెళ్లే అవకాశమున్నా.. ఆత్మహత్య చేసుకున్నదని అంటున్నారు. అంటే ఆమెను ఎక్కడో మధ్యలోనే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా.. అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేయాలంటున్నారు.
ఎస్సై అంత పని చేస్తారా?
శిరీషపై అత్యాచారయత్నమే జరిగితే ఎస్సైపై కేసు నమోదుతుందని, నిరూపణ అయితే సస్పెండ్ లేదా డిస్మిస్ చేస్తారని, అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని తెలియాలని అంటున్నారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్నది తేలాలంటున్నారు. రాజీవ్, శ్రవణ్లు చెప్పిందే కాకుండా.. పూర్తిస్థాయి దర్యాఫ్తు జరపాలని ఓ వ్యక్తి డిజిపికి లేఖ రాసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
మిస్టరీ లేదు.. కానీ హత్యపై ఏ ఆధారం సమర్పించినా..
మరోవైపు, శిరీష మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదని పోలీసులు చెబుతున్నారు. అన్నీ సాంకేతిక ఆధారాలతో ఆమెది ఆత్మహత్యగా ధృవీకరించినట్లు చెబుతున్నారు. అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల సందేహాలను శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమెది హత్య అని నిర్ధారించేందుకు ఎవరు, ఏ ఆధారం సమర్పించినా పరిగణలోకి తీసుకోనున్నారు.