ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా ఇక లేరు... కరోనాతో హైదరాబాద్లో కన్నుమూత...
ఉద్యమాల ఉపాధ్యాయుడు,బహుజన సాహితీవేత్త,సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు అలియాస్ ఊసా కరోనా బారినపడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(జూలై 24) రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఊసా మృతి పట్ల ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన మరణం బహుజన ఉద్యమాలకు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.
తెలుగు నేలపై పురుడు పోసుకున్న అస్తిత్వ ఉద్యమాలకు ఊసా పెద్ద దిక్కుగా ఉన్నారు. దళిత,బహుజనులపై వివక్ష,అణచివేతకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాధికార సాధనకై ఆయన నిరంతరం పనిచేస్తూ వస్తున్నారు. విప్లవోద్యమంతో మొదలైన ఆయన ప్రస్థానం ఆ తర్వాత లాల్-నీల్ సిద్దాంతంతో కుల వర్గ నిర్మూలన పోరాటం వైపు సాగింది. అరవై ఏళ్ల వయసులోనూ.. యువతతో మమేకం అవుతూ ఎన్నో సిద్దాంతాలను వారికి పూసగుచ్చినట్లు వివరించేవారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ... ప్రజాస్వామికవాదిగా తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు.
మార్క్సిస్టు తాత్వికత,అంబేడ్కర్ సిద్దాంతాలతో బహుళ బహుజన రాజకీయాలకు ఊసా ఒక ప్రాతిపదిక ఏర్పరిచారు. విప్లవ,బహుజన రాజకీయాల పట్ల సమగ్ర అవగాహనతో,ముందుచూపుతో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1985లో కారంచేడులో దళితుల నరమేధం సందర్భంగా 'కమ్మభూస్వాముల దాడి' అంటూ ధిక్కార స్వరంతో కరపత్రం రాశారు. బహుజన ఉద్యమ నాయకుడు మారోజు వీరన్న కుల-వర్గ పోరాటాల డాక్యుమెంట్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఆధిపత్య అహంకారం,రాజ్యహింస ఎక్కడ బుసలు కొట్టినా ఊసా ముందుండి పోరాడారు. నిత్యం జనాలను చైతన్యం చేస్తూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అలాంటి ఊసా కరోనాతో మృతి చెందడం తెలుగు నేలపై ఎంతోమందిని శోకసంద్రంలో ముంచివేసింది.