సూపర్ మార్కెట్ లలోనూ సామాజిక దూరం: పాటించకుంటే సీజ్ చేసుడే అంటున్న అధికారగణం
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 644కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . ఇక ఈ నేపధ్యంలో కేంద్ర సర్కార్ కంటే ముందే తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించింది . సామాజిక దూరం పాటించాలని , మాస్కులు లేకుండా బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ ను చాలా కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .
నిత్యావసరాలు విక్రయించే సూపర్ మార్కెట్ లలోనూ సోషల్ డిస్టెన్స్
కరోనాపై పోరాటం చేస్తున్న క్రమంలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే ప్రజలు బయటకు వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నిత్యావసరాలు విక్రయించే దుకాణాల వద్ద కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పింది . ఎక్కడి వెళ్లినా పరిశుభ్రంగా ఉండటం, శానిటైజర్ లతో చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం పాటించడం అనేవి ముఖ్యంగా అని పేర్కొంది. సామాజిక దూరం పాటిస్తేనే కరోనా నుంచి బయటపడగలమని చెప్తుంది.చాలా వరకు ప్రజల్లో అవగాహన పెరిగి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కొన్ని చోట్ల మాత్రం నిత్యావసరాల కోసం సామాజిక దూరం మర్చిపోతున్నారు .
సూపర్ మార్కెట్ ల వద్ద పాటించని సామాజిక దూరం
ముఖ్యంగా సూపర్ మార్కెట్ వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది . దీంతో చాలా సూపర్ మార్కెట్ ల వద్ద అక్కడ ప్రజలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తోంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సూపర్ మార్కెట్ కు ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ నేపధ్యంలో సూపర్ మార్కెట్ యాజమాన్యం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది . ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో సూపర్ మార్కెట్ కు వెళ్లి కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో డీమార్ట్ సీజ్
మళ్ళీ దొరుకుతాయో లేదో అనే విధంగా కొనుగోలు చేస్తున్న నేపధ్యంలో వారిని కంట్రోల్ చెయ్యటంలో సూపర్ మార్కెట్ యాజమాన్యం ఫెయిల్ అవుతుంది. దీంతో భారీ సంఖ్యలో సూపర్ మార్కెట్ కు ప్రజలు వస్తున్నారు. వారు సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా గుంపులుగా మార్కెట్ లో నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ ఒకేచోటా ఉన్నందుకు ఎల్బి నగర్ లోని డిమార్ట్ సూపర్ మార్కెట్ ను అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్లో సామాజిక దూరం పాటించకుంటే ఇలానే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సామాజిక దూరం పాటించటం తప్పని సరి .. లేదంటే చర్యలే
సూపర్ మార్కెట్ లో అయినా వచ్చిన ప్రజలను దూరంగా ఒక లైన్ లో నిలబెట్టి వారికి శానిటైజ్ చేసి కేవలం 10 మంది చొప్పున పంపించి ఇక వారు వచ్చాకనే మిగతా వారిని పంపిస్తే కాస్త ఆలస్యం అయినా సామాజిక దూరం పాటించి ఆరోగ్య రక్షణకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా గుంపులుగా ఎగబడితే సదరు సూపర్ మార్కెట్ కే కాదు ఆ ప్రాంత వాసులకు షాక్ ఇస్తారు అధికార గణం. ఇక దీంతో అక్కడ నిత్యావసరాల కోసం తిప్పలు పడాల్సి వస్తుంది .