ఇది కేసీఆర్ సర్కార్ మరో ఫెయిల్యూర్ స్టోరీ: వట్టి ఊదరగొట్టుడేనా?
దేశంలోనే నంబర్1 సీఎం అని చెప్పుకునే కేసీఆర్ హయాంలో ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ ఏంటో అని జనం నిష్టూరపోతున్నారు.
హైదరాబాద్: నీళ్లు-నిధులు-నియామకాలు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ముఖ్య భూమిక పోషించిన ప్రాతిపదిక ఇది. ఇదే నినాదంతో ప్రజలు తెలంగాణ సాధించుకున్నారు గానీ గద్దెనెక్కిన ప్రభుత్వం మాత్రం దీన్ని విస్మరిస్తున్నట్లుగానే కనిపిస్తోంది.
రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి డీఎస్సీ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఊదరగొట్టే ప్రకటనలతో ప్రభుత్వం ఇదిగో.. అదిగో.. అంటూ ఆశపెట్టిందే తప్పా.. ఇప్పటికీ డీఎస్సీ నిర్వహించింది లేదు. ఒక్క డీఎస్సీ యేనా? గ్రూప్-1 ఫలితాల విషయంలోను, ఎస్ఐ ఫలితాల విడుదల విషయంలోను సర్కార్ దీ ఫెయిల్యూర్ స్టోరీనే.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. జనానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ యువత ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. సర్కార్ నుంచి యథావిధిగానే దీనికి సమాధానం ఉండకపోవచ్చు కానీ ప్రశ్నించే గొంతుకలు ప్రభుత్వాలను వణికించే రోజులు మళ్లీ రాకపోతాయా?
2014 జనవరిలో డీఎస్సీకి ఆమోదం:
కొత్త రాష్ట్రం ఏర్పడబోయే కొన్ని నెలల ముందు జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. 20వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలిపింది. జూన్2న రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల విభజన అనంతరమే కొత్త నియామకాలు ఉంటాయని చెప్పడంతో.. నిరుద్యోగులు కూడా కొంత వేచిచూసే ధోరణిని అవలంభించారు.
జాప్యం కొనసాగుతూనే ఉంది:
2015 జనవరి.. అంటే అప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడి ఏడాది. రేషనలైజేషన్ పూర్తయిన తర్వాతే డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. సెప్టెంబర్ లో 18వేల డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ప్రచారం జరిగింది. ఆర్థిక శాఖ ఆమెదం రాగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని తెలిపింది.
అనంతరం 2016 వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా 15రోజుల్లో డీఎస్సీ ప్రకటన అంటూ సీఎం వాగ్దానం చేశారు. ఈ ప్రకటన కూడా అటకెక్కింది. ఉపాధ్యాయ, పాఠశాలల రేషనలైజేషన్ తర్వాత 12వేల పోస్టులతో నోటిఫికేషన్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఏళ్ల కొద్ది తాత్సారమేనా?:
వరంగల్ ఉపఎన్నిక సందర్బంగా సీఎం ఇచ్చిన హామి అటకెక్కగా.. టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాతే దసరా నాటికి టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. ఆ తర్వాత ఏవేవో కారణాలతో మళ్లీ వాయిదాపడింది. 2017జనవరిలో జూన్ నాటికి 9వేల మంది కొత్త ఉపాధ్యాయులంటూ మళ్లీ ఓ ప్రకటన చేసింది. ఆరు నెలల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించింది.
మొత్తం 12సార్లు వాయిదా పడింది:
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 12సార్లు ప్రకటనలతో డీఎస్సీ గురించి ఊదరగొట్టిన ప్రభుత్వం వాస్తవంలో మాత్రం దాన్ని అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. దీంతో డీఎస్సీ నిరుద్యోగులంతా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదేనా? బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నారు.
ఎస్ఐ అభ్యర్థులది అదే కథ:
దేశంలోనే నంబర్1 సీఎం అని చెప్పుకునే కేసీఆర్ హయాంలో ఈ ఫెయిల్యూర్ ల కథేంటో అని జనం నిష్టూరపోతున్నారు. గతేడాది 2106నవంబర్ లో ఎస్ఐ అభ్యర్థులు రాసిన లాంగ్వేజెస్ పరీక్ష ఫలితాలు ఇప్పటికీ విడుదల కాలేదు. టీఎస్ పీఎస్ సీ నిర్లక్ష్యమో.. ప్రభుత్వ అలసత్వమో కానీ నిరుద్యోగులు మాత్రం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.