సహోద్యోగికి అసభ్యకరమైన మెయిల్స్, మెసేజ్లు: సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సహోద్యోగినిని వేధించిన మేనేజర్పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. బాధిత ఉద్యోగిని ఫిర్యాదు చేయడంతో అతడిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది. పూర్తి ఆధారాలు దొరకడంతో కూకట్పల్లి పోలీసులు సదరు మెనేజర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం - హైదరాబాదులోని మాదాపూర్లోని డెల్ కంపెనీలో ఓ విభాగానికి మేనేజర్గా పనిచేస్తున్న అశ్విన్కుమార్ తోటి ఉద్యోగినికి కొంత కాలంగా అసభ్యకరమైన మెయిల్స్తో పాటు ఎస్ఎంఎస్లు పంపుతున్నాడు. ఈ విషయంపై బాధిత మహిళ పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు.
విషయాన్ని ఆమె తండ్రికీ భర్తకూ చెప్పింది. ఈ నేపథ్యంలో యువతి తండ్రి అశ్విన్కుమార్ను నిలదీయగా మారుతానని నమ్మించి, తిరిగి వేధింపులను కొనసాగించాడు. ఈ విషయంపై సదరు ఉద్యోగిని మాదాపూర్ డివిజన్ షీటీమ్స్కు ఫిర్యాదు చేసింది.
దీంతో షీటీమ్ అశ్విన్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. అతడు పంపించిన మెయిల్స్, మెసెజ్ల ఆధారాలు సేకరించి, కూకట్పల్లి పోలీసులకు అప్పజెప్పింది. దీంతో పోలీసులు అతనిపై నిర్భయ కేసును నమోదు చేసుకుని మంగళవారం రిమాండ్కు తరలించారు.