బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. కోట్ల వేతనాలు ఎగవేత!
బంజారాహిల్స్ : దాదాపు కోటి రూపాయలకు పైగా వేతనాలను ఎగ్గొట్టి.. ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బిచాణా ఎత్తేసింది. నెలన్నర రోజులుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తూ వస్తోన్న ఉద్యోగులకు ఏదో ఒకటి చెప్పి.. సాగదీస్తూ వచ్చిన కంపెనీ గురువారం నాడు బోర్డు తిప్పేసింది. దీంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు ఉద్యోగులు.
వివరాల్లోకి వెళ్తే.. బంజరాహిల్స్ రోడ్డు నం.2లో ఉన్న వ్యాంకో గ్లోబల్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీలో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నెలన్నర రోజులుగా ఉద్యోగులెవరకీ వేతనాలు ఇవ్వలేదు కంపెనీ యాజమాన్యం. సుమారుగా రూ.1.25 కోట్లను యాజమాన్యం ఉద్యోగులకు బకాయిపడింది. వేతనాల గురించి ఎప్పుడూ ఆరా తీసిన నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ వచ్చారు సీఈవో శ్రీకాంత్ కిరణ్ చెరు, సృజన గొట్టిముక్కల.
ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఉద్యోగులంతా ఆందోళన చేసి.. యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడంతో గురువారం నాడు వేతనాలు చెల్లించడానికి అంగీకరించారు. ఇదే క్రమంలో గురువారం నాడు ఆఫీస్ కు వెళ్లిన ఉద్యోగులందరు సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయంపై ఫిర్యాదు చేశారు.