ప్రేమించిన యువతిని మర్చిపోలేక సాప్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాద్: "అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. నా హృదయంలో నేను ప్రేమించిన అమ్మాయిని తప్ప వేరొకర్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పటి వరకు చాలా ప్రయత్నించా. నా వల్ల కావడం లేదు. ఆమె లేకపోతే ప్రాణం పోయేంత బాధగా ఉంది. ఇది నిజంగా వర్ణాతీతం" అంటూ తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోలేకపయాననే బాధతో ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ లేఖ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్కు చెందిన సంగెపు రవీంద్రనాథ్(26) భార్యతో కలిసి మాధవరంనగర్ కాలనీలో ఉంటున్నాడు.
రవీంద్రనాథ్ హెచ్సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా.. భార్య డెంటల్ డాక్టర్. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఆగస్టులో పెళ్లి అయింది. బుధవారం ఉదయం ఆమె విధులకు వెళ్లగా ఇంట్లోనే ఒంటరిగా ఉన్న రవీంద్రనాథ్ గదిలోని ఫ్యాన్ కొక్కేనికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రవీంద్రనాథ్ స్నేహితులు సాయంత్రం ఇంటికి వచ్చి గమనించారు. దీంతో స్థానికుల సహాయంతో ఇంటి యజమాని కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా రవీంద్రనాథ్ అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు.
అదే సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్య విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి కన్నీరు మున్నీరైంది. స్థానికులు వెంటనే బంధువులకు, కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రవీంద్రనాథ్ రాసిన సూసైడ్నోట్ దొరికింది. అతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.