దుబ్బాక ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత, కేసీఆర్ ఏమన్నారంటే?
హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పనిచేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు.
రామలింగారెడ్డి కుటుంబం యావత్తు, అటు ఉద్యమంలోనూ, నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలుపంచుకుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధంగా ఉందన్నారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలు కావడానికి సోలిపేట కుటుంబసభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం సమంజసమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Recommended Video
జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు దుబ్బాక నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా నియోజకవర్గంలో జోరుగుా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని మంగళవారం ప్రకటించనున్నట్లు వెల్లడించింది.