కోర్టుల ద్వారా కాదు: అయోధ్య వివాదంపై శ్రీశ్రీ రవిశంకర్
న్యూఢిల్లీ: రామజన్మ భూమి, బాబ్రీ మసిదుకు చెందిన అయోధ్య వివాదం కోర్టుల ద్వారా పరిష్కారం కాదని ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ కోర్టులో ఓడిపోతుందని, తొలుత ఆ పార్టీ తీర్పును అంగీకరిస్తుందని, అదే విషయంపై మళ్లీ గొంతు విప్పుతుందని ఆయన అన్నారు.
కోర్టు వెలుపల సామరస్యపూర్వకమైన ఒప్పందమే వివాదాన్ని పరిష్కరించడానికి ఉత్తమ మార్గమని ఆయన అన్నారు. తనపై వచ్చిన విమర్శలపై ప్రతిస్పందిస్తూ తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని అన్నారు.
కోర్టు వెలుపల అయోధ్య వివాదాన్ని పరిష్కరించుకోవాలనే ఆయన ప్రతిపాదనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అయోధ్య వివాదానికి దూరంగా ఉండాలని బాబ్రీ యాక్షన్ కమిటీ ఆయనకు సలహా ఇచ్చింది. కొందరు రాజకీయ నేతలు కూడా ఆయన ప్రతిపాదనను వ్యతిరేకించారు.
వివాదాన్ని పరిష్కరించుకోవడానికి హిందువులు, ముస్లింలు ఒక చోటికి రావాలని ఆయన అంతకు ముందు అన్నారు. తాను పలువురు స్టేక్ హోల్డర్లతో మాట్లాడుతున్నానని, రెండు కమ్యూనిటీలు ఒక్క చోటికి రావాలని, కోర్టు వెలుపల ఒప్పందం మంచిదని ఆయన అన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. కొంత మంది దాంతో ఏకీభవించకపోవచ్చు గానీ ముస్లింలు చాలా వరకు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని అన్నారు.
సమస్యకు పరిష్కారం కొన్ని సార్లు అసాధ్యమనిపిస్తుందని అంటూ ఇరు వర్గాల ప్రజలు, యువత, నాయకులు దాన్ని సాధ్యం చేయగలరని ఆయన అన్నారు. వివాదంపై తుది విచారణను సుప్రీంకోర్టు 2017 డిసెంబర్ 5వ తేదీన ప్రారంభించింది.