హైదరాబాద్లో మతసామరస్యాన్ని చెడగొట్టే కుట్ర జరుగుతోంది... అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కొన్ని పార్టీలు మత సామరస్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనాదిగా హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీకగా ఉంటోందని... అదే స్పూర్తిని కొనసాగించాలని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఎంఐఎం పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశంలో అన్ని మతాలకు సమాన హక్కు ఉందని... సమాజంలో అశాంతిని రేకెత్తించి ఓట్లు పొందేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ఆగడాలను ఎంఐఎం అడ్డుకుని తీరుతుందన్నారు. గురువారం (నవంబర్ 26) హైదరాబాద్లోని రెడ్హిల్స్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్న కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు. కరీంనగర్లోనో, వరంగల్లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు సృష్టించి.. వాటిని హైదరాబాద్కు విస్తరించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రార్థన మందిరాల దగ్గర వికృత చేష్టలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది వారి పన్నాగమని.. తద్వారా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలపై బుధవారం ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డీజీపీ మహేందర్ రెడ్డి కూడా గురువారం(నవంబర్ 26) ఇదే విషయాన్ని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని అరాచక శక్తులు విధ్వంసానికి,కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఎవరైనా సరే శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుట్రలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులపై పూర్తి నిఘా ఉంటుందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రసంగాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు తప్పవన్నారు. ఇప్పటివరకూ 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.