తెలంగాణ కేడర్ వద్దు: ఇతర రాష్ట్రాలకు ఐఏఎస్ల వలస: ఎమ్మెల్యేల పెత్తనమే కారణమా..!
ఐఏయస్ అధికారులు తెలంగాణలో ఉండటానికి ఇష్టపడటం లేదా. తెలంగాణలో సర్వీసు అంటే వద్దని ఎందుకు అంటున్నారు. అనేక మంది ఐఏయస్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెడతుండటంతో కొందరు అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారంటూ ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన వరకూ హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో రాష్ట్రం లో పనిచేసే అవకాశం కోసం ఐఏఎ్సలు ఎగబడే వారు.
టాపర్లంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకొనేందుకు ఉత్సాహం చూపించేవారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక మంది సీనియర్లతో సహా పలువురు అధికారులు తెలంగాణకే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, కొంత కాలంగా ఇప్పుడు హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ను కొత్త ఐఏఎస్ లు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ ఉన్న తెలంగాణ విషయంలోనూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఎమ్మెల్యేలపెత్తనం కారణంగానేనా..!
తెలంగాణలో 10 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి. 33 జిల్లాలుగా మార్చారు. జిల్లాల స్వరూపం డివిజన్ల స్థాయికి చేరింది. ఎమ్మెల్యేలే జిల్లాలకు కింగ్ మేకర్లుగా మారారు. ప్రజాప్రతినిధులతో వివాదాల కారణంగా ఆర డజనుకు పైగా ఐఏఎ్సలకు ఇటీవల స్థాన చలనం కలిగింది. సమర్థులు, నిజాయితీపరులుగా పేరున్న వారెవరికీ పెద్దగా గుర్తింపు లేదు.
పోస్టింగుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎ్సలు తెలంగాణను ఎంచుకోవడానికి విముఖత చూపుతున్నారు. తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారు కీలక బాధ్యతల్లో ఉండగా..తెలంగాణకు వచ్చిన వారికి ఇబ్బందులు ఎదుర వుతున్నాయని చెబుతున్నారు. దీంతో..ఇతర రాష్ట్రాల వైపు వారు ఆసక్తిగా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
సర్వీసు నిబంధనలు అమలు కావటం లేదంటూ..
సివిల్ సర్వెంట్లు వివాహం చేసుకుంటే జీవిత భాగస్వామి పని చేస్తున్న రాష్ట్రానికి బదిలీ చేయించుకోవడానికి సర్వీసు నిబంధనలు కానీ, కొద్ది కాలంగా ప్రత్యేకంగా యువ ఐఏఎస్ అధికారుల విషయంలో మాత్రం ఈ సర్వీసు నిబంధనలు అమలు కావటం లేదంటూ కొంత మంది అధికారుల అంశాలను వివరిస్తున్నారు. 2017 బ్యాచ్కు చెందిన ఐల త్రిపాఠీని బిహార్ కేడర్కు చెందిన ఐఏఎస్ భవేష్ మిశ్రా(2015 బ్యాచ్) పెళ్లి చేసుకొని తెలంగాణకు వచ్చారు.
నాలుగు నెలలుగా భార్యకు పోస్టింగు లేదు. 2011 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ కిల్లు శివకుమార్ నాయుడు ఐపీఎస్ అధికారిణి చేతన మైలబత్తులను వివాహం చేసుకొని మణిపూర్ కేడర్ నుంచి తెలంగాణ కేడర్కు వచ్చారు. ఆయన్ను ప్రణాళిక శాఖలో ప్రాధాన్యం లేని పోస్టులో పెట్టారు. కర్ణాటకకు చెందిన పి. ప్రావీణ్య 2016 బ్యాచ్కు చెందిన శరత్చంద్ర పవార్ను పెళ్లి చేసుకొని తెలంగాణకు వచ్చారు. ఇద్దరూ పోస్టింగుల కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితి ఐఏయస్ అధికారుల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆ అధికారులు ఎందుకెళ్లారంటే..
తాజాగా కొందరు అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవటం పైన అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒడిసాకు చెందిన 2017 బ్యాచ్ అధికారి అవిశ్యంత్ పాండాను తెలంగాణకు కేటాయించారు. ఆయన మహారాష్ట్రకు చెందిన వసుమన పంత్ ఐఏఎ్సను వివాహం చేసుకొని ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఇక్కడే ఉంటే వెయిటింగులో ఉండాల్సి వచ్చేది.
2018 బ్యాచ్ తెలంగాణ కేడర్కు చెందిన మసందా మాడ్గలిన్ పెర్టిన్ అసోంకు చెందిన ఐఏఎ్సను పెళ్లి చేసుకొని, తెలంగాణ కేడర్ను వదులుకొని, ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. తెలంగాణ కేడర్కు చెందిన శ్వేతా తియోతియా(2011) కూడా గుజరాత్ అధికారిని వివాహం చేసుకొని ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. 2014 బ్యాచ్కు చెందిన కృతికా జ్యోత్స్న యూపీకి చెందిన రాహుల్ పాండేను వివాహం చేసుకొని ఆ రాష్ట్రానికి బదిలీ మీద వెళ్లారు. ఇప్పుడు అధికారులు ఇలా వెళ్లిపోతున్న వ్యవహారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.