సీఎం కేసీఆర్ కు సవాల్ గా :పెరుగుతున్న అసంతృప్తులు: తాజాగా మాజీ మంత్రులు..!!
అధిక మెజార్టీతో రెండో సారి అధికారం చేపట్టిన కేసీఆర్ కు ఇప్పుడు కొత్త తల నొప్పులు మొదలయ్యాయి. పదవుల పందేరం టీఆర్ఎస్లో కొత్త సమస్యలు సృష్టి స్తోంది. రోజుకో అసంతృప్త నేత బయటకు వస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలంతో మరి కొందరు నేతలు బయటకు వస్తుననారు. మంత్రివర్గ విస్తరణ తరువాత గళం విప్పుతున్న వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీర విధేయులే. అయితే, అటువంటి నేతలే ఇంత ఓపెన్ గా అసంతృప్తి వ్యక్తం చేయటం పార్టీలో..ప్రభుత్వంలో చర్చ నీయాంశంగా మారింది. ఇక, ఇప్పుడు ఈ లిస్టులో మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డితో పాటుగా జోగు రామన్న.. రాజయ్య..మైనంపల్లి చేరారు. మాజీ మంత్రి జోగు రామన్న గన్ మెన్లను వీడి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరి విషయంలో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
హరీష్ రావు పని అడకత్తెరలో పోకచెక్కేనా? సీఎం కేసీఆర్ బడ్జెట్ మర్మం ఇదేనా ?
మంత్రివర్గ విస్తరణతో కొత్త సమస్యలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కొత్త సమస్యలను తెచ్చి పెడుతోంది. కేసీఆర్ మంత్రుల ఎంపికలో అనుసరించిన వ్యూహాలు కొత్త అసంతృప్త నేతలకు అవకాశంగా మారింది. కొద్ది రోజుల క్రితం మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో మొదలైన దుమారం మరి కొంత మంది నేతల వ్యాఖ్యలతో కొనసాగుతూనే ఉంది. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలానికి కారణమయ్యాయి. ఆయన నేరుగా కేసీఆర్ మాట తప్పారంటూ వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని...ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే వద్దన్నారని నాయిని చెప్పుకొ చ్చారు. అదే సమయంలో తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని నాయిని వ్యాఖ్యానించారు. దీని పైన చర్చ సాగుతుండగానే మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య కూడా తనకు ఏ పదవీ దక్కే పరిస్థితి లేదని వాపోయారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించక పోవడాన్ని మీడియా వద్ద ప్రస్తావించడంతోపాటు మాదిగ కుల సంఘాలు ప్రశ్నించాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు.
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగు రామన్న..
మంత్రివర్గ విస్తరణతో తమకు ఖాయంగా అవకాశం దక్కుతుందనే ఆశతో ఎదురు చూసిన పలువురు నేతలు ఆవేదన చెందుతున్నారు. సీనియర్లకు అవకాశం ఇవ్వకపోయినా వారిని పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విఛాఫ్ చేయడంతోపాటు గన్మెన్లను కూడా వదిలి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. తనకు తిరిగి మంత్రి పదవి లభిస్తుందనే ధీమాతో ఉన్న జోగు రామన్న మినిస్టర్ క్వార్టర్స్లోనే ఉంటున్నట్లు తెలిసింది. మంత్రి పదవిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతోనే మినిస్టర్ క్వార్టర్స్లో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇదే విధంగా..
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం వెనుక కూడా అసంతృప్తే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలు సద్దుమణుగుతున్న వేళ తాజాగా అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. ఈటల స్థానంలో కొత్త మంత్రి గంగుల కమలాకర్ హాజరు కావడంతో ఈటలకు చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఓవైపు బీజేపీ పదేపదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల అసమ్మతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా దారికి తీసుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.