తెలంగాణ నూతన సీఎస్గా సోమేశ్ కుమార్: ప్రభుత్వ సలహాదారుగా ఎస్కే జోషి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు.
సీఎస్గా 2023 వరకు సోమేశ్ కుమార్..
2020 జనవరి 1 నుంచి 2023 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండటం వల్ల సోమేశ్ కుమార్ను నియమించాలని ప్రభుత్వం తెలుస్తోంది. కాగా, సోమేశ్ కుమార్కు మూడేళ్ల సర్వీస్ మిగిలివుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
అందుకే సోమేశ్ కుమార్ నియామకం..
కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజియ్ మిశ్రా కూడా ఉన్నప్పటికీ సోమేశ్ కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. సీనియర్ అయిన అజయ్ మిశ్రాకు మరో ఆరు నెలల మాత్రమే సర్వీస్ ఉండటంతో ప్రభుత్వం సోమేశ్ ను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రభుత్వ సలహాదారుగా ఎస్కే జోషి..
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్ జోషి(ఎస్కే జోషి)ని మంగళవారం తమ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా ఎస్కే జోషి వ్యవహరించనున్నారు.