కేంద్ర బృదం అసహనం: అసంతృప్తి లేదన్న సోమేష్ కుమార్
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సోమేశ్ కుమార్పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్ అధికారి సోమేష్కుమార్ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి జిహెచ్ఎంసి కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా సోమేష్కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ అధికారిని అయినా ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. తనకు ఏ శాఖపైనా ప్రేమ లేదని, బదిలీ చేయగానే వెంటనే విధుల్లో చేరానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు సరైనవి అవునా కాదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని సోమేష్కుమార్ వివరించారు.
ఈ స్థితిలోనే ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆధారాలూ సమర్పించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేశారు. టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ కూడా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశారు.
జీహెచ్ఎంసీలో ఓటర్ల తొలగింపు ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తెలంగాణలోని ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలపై పరిశీలనకు ఇతర రాష్ట్రాల అధికారులను నియమించింది. పశ్చిమ బెంగాల్ సీఈవో సునీల్ గుప్తా నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ అదనపు సీఈవో, ఆరుగురు కార్యదర్శులు, ఆరుగురు సహాయ కార్యదర్శులతో కూడిన 14 మంది బృందాన్ని పంపించింది.
గురువారమే నగరానికి వచ్చిన ఈ బృందం క్షేత్రస్థాయిలో అక్కడక్కడా పరిశీలన జరిపింది. శుక్రవారం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైంది. ఫిర్యాదులు అందిన అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది.