వివక్ష... కరోనాను జయించి ఇంటికొస్తే... కొడుకు,కోడలు చేసిన పనికి...
కరోనా పేషెంట్ల పట్ల వివక్ష తగదని ఎవరెంత మొత్తుకున్నా చాలామందికి చెవికి ఎక్కట్లేదు. ఆఖరికి కుటుంబ సభ్యులే వివక్ష చూపిస్తున్న పరిస్థితి. దీంతో కరోనా బాధితుల కష్టాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. కరోనాపై పోరులో గెలిచినా.... ఇంట్లోవాళ్ల అపోహలను జయించలేక చాలామంది తల్లడిల్లుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
బీజేఆర్ నగర్కు చెందిన ఓ మహిళ(55) ఇటీవల కరోనా బారినపడింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆమె శుక్రవారం(జూలై 24) సాయంత్రం డిశ్చార్జి అయింది. అయితే కరోనాను జయించి వచ్చిన తల్లికి అండగా నిలవాల్సిందిపోయి... కొడుకు,కోడలు ఆమెను ఇంట్లోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. అంతేకాదు,ఇంటి పైకప్పు రేకులను ధ్వంసం చేసి.. ఇంటికి తాళం వేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక ఆమె రాత్రంతా ఇంటి ముందే కూర్చుండిపోయింది. కొడుకు,కోడలు చేసిన పనికి ఏడుస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది.
Recommended Video
కరోనాను జయించి వచ్చిన పేషెంట్లకు కొన్నిచోట్ల కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్తుంటే... మరికొన్ని చోట్ల ఇలా అవమానాలు,ఛీత్కరింపులు ఎదురువుతుండటం గమనార్హం. ఇటీవల పుణేకి చెందిన ఓ యువతి కరోనాను జయించి ఆస్పత్రి నుంచి ఇంటికి రాగా... ఆమె సోదరి పట్టరాని సంతోషంతో డ్యాన్స్ చేస్తూ ఆమెకు స్వాగతం పలికిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇలా కొంతమంది కరోనా బాధితులకు అండగా నిలబడుతుండటంపై హర్షం వ్యక్తమవుతుండగా.. మరికొందరు వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. జనాల మైండ్ సెట్లో మార్పు రావాలని,కరోనా పేషెంట్ల పట్ల వివక్ష తగదని వైద్యులు సూచిస్తున్నారు.