23న సోనియా గాంధీకి సన్మానం: కుంతియా, ఆర్ కృష్ణయ్యని నిలబెట్టారని కోదండ ఆవేదన
Recommended Video
ఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి సన్మానం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా మంగళవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లే అయిందని ఆయన చెప్పారు. ఆమె వల్లే తెలంగాణ సిద్ధించిందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు.
అంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్లెన్నో
ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 3వ తేదీన రాహుల్ గాంధీ సభలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 స్థానాల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11వ తేదీ ఫలితాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది తామేనని చెప్పారు.
మేడ్చల్లో సోనియా సభ
పలు నియోజకవర్గాల్లో తమ పార్టీకి చెందిన ఆశావహులు రెబల్స్గా పోటీ చేస్తున్నారని ఆర్సీ కుంతియా గుర్తు చేశారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా సోనియా గాంధీ 23 సాయంత్రం ఐదు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా మేడ్చల్ చేరుకుంటారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు.
జనగామ వదిలేశాం
బీసీల కోసం తాము జనగామ సీటును వదులుకున్నామని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం వేరుగా చెప్పారు. కానీ మేం కోరుకున్న మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ కృష్ణయ్యను నిలబెట్టందని వాపోయారు. తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి సహజమని చెప్పారు.
మహాకూటమి వల్లే తెరాసకు ప్రత్యామ్నాయం ఉందని తెలిసింది
ప్రజాకూటమికి నష్టం లేకపోతే తాను జనగామ నుంచి పోటీ చేయాలని భావించానని చెప్పారు. ప్రజాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రాంను త్వరలో ప్రజల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. మహాకూటమి వల్లే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితికి మరో ప్రత్యామ్నాయం ఉందని అర్థమైందని చెప్పారు.
విరమించుకుంటారని భావిస్తున్నాం
మహాకూటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మేడ్చల్లో ఈ నెల 23న జరగనున్న సోనియా గాంధీ సభలో తాము పాల్గొంటామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కూటమి పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించిన స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని తాము భావిస్తున్నామని చెప్పారు. మహాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని కోదాడరాం ధీమా వ్యక్తం చేశారు.