టీడీపీ ఔట్! తెలంగాణ కాంగ్రెస్పై డౌట్: సోనియా సీరియస్, డిగ్గీపై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మినహా మిగితా వారందరూ తెలంగాణ రాష్ట్ర సమితి కండువా కప్పేసుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా మరికొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి అధికార పార్టీ బాటపట్టారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై పార్టీ జాతీయ అధ్యక్షురాలు సానియా గాంధీ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనయిర్ నేత డి. శ్రీనివాస్ నుంచి బసవరాజు సారయ్య వరకూ పలువురు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తి చేసినట్లు తెలిసింది.
'తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేస్తే మొత్తం 17 ఎంపీ స్థానాలతోపాటు అధికారాన్ని చేపట్టడం ఖాయమంటూ డాంబికాలు పలికారు కదా! ఇప్పుడు కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలను కూడా కాపాడుకోలేక పోతున్నారెందుకు? జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మంలలో కూడా ఘోర పరాజయాన్ని చవి చూడడానికి కారణాలేంటి? ' అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ పీసీసీ నేతల వైఖరిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఎటువంటి అభిప్రాయం ఉందని కూడా ఆమె ఆరా తీశారు. మొత్తం అన్ని అంశాలతో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ను ఆమె కోరినట్లు సమాచారం. తెలంగాణలో వరుస పరాజయాలు, నేతల వలసలపై సోనియా గాంధీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయని తెలిసింది. పలువురు సీనియర్లు లేఖలతో ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. పలువురు నాయకులు ఉత్తమ్ నాయకత్వంపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కాగా, గతంలో అధికారాన్ని దక్కించుకున్న మున్సిపాల్టీల్లో ఇప్పుడు సింగిల్ డిజిట్కు పరిమితం కావడం ఆమె సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆమె దిగ్విజయ్సింగ్ను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 'అసలేం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ ఉంటుందా? ఉండదా?' అంటూ మండిపడినట్లు సమాచారం.
'ఏపీ, తెలంగాణలో అధికారంలోకి రాకపోతే కేంద్రంలో కూడా పార్టీ అధికారంలోకి రాదు. ఈ విషయం మీకూ తెలుసు కదా! గతంలో చాలాసార్లు మనం కేంద్రంలో అధికారంలోకి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వచ్చిన సీట్ల కారణంగానే.! అక్కడ పార్టీని కాపాడుకోవాలి' అని సోనియా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అధినేత్రి ఆదేశాలను దిగ్విజయ్ టీపీసీసీ నేతలు, ఎంపీలకు చేరవేశారు.
ఈ నేపథ్యంలో మార్చి 19వ తేదీన హైదరాబాద్లో సమీక్షా సమావేశానికి ఏర్పాట్లు చేయాలని, కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ ఆహ్వానించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్కు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సిఫార్సుల మేరకు తెలంగాణ కాంగ్రెస్లో భారీస్థాయిలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ఇందుకు సమీక్షా సమావేశం తర్వాత దిగ్విజయ్ అధిష్ఠానానికి ఇచ్చే నివేదికే కీలకం కానుంది.
ప్రస్తుత టీపీసీసీ నాయకత్వాన్ని మార్చి యువ నేతలకు అవకాశం కల్పించాలని ఒక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి నివేదికలు పంపినట్లు తెలిసింది. ఉత్తమ్ కుమార్ టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి ఎదురైన అపజయాల పట్టికను కొంతమంది సీనియర్లు అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభంపై జోక్యం చేసుకోవాలంటూ అధిష్ఠానానికి రాజ్యసభసభ్యుడు వి హనుమంతరావు సుదీర్ఘ లేఖ రాసినట్లు తెలిసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 2019 నాటికి కాంగ్రెస్ కనుమరుగయ్యే ప్రమాదముందని హెచ్చరించినట్లు తెలిసింది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోతున్న క్రమంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించేందుకు నేతలు ప్రణాళికలు వేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.