సోనియా గాంధీ అయినా డోంట్ కేర్: తెలంగాణ ఇచ్చిన అమ్మ అయితే మాకేంటి ? ప్లాన్ రివర్స్ !
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణలో టీఆర్ఎస్ దెబ్బకు అన్ని పార్టీలు షాక్ కు గురైనాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ప్రజాకూటమి నువ్వానేనా అంటూ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయిన తరువాత వార్ వన్ సైడ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో కీలకపాత్ర పోషించిన యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. సోనియా గాంధీ మనవిని తెలంగాణ ప్రజలు లెక్కచెయ్యలేదు.
తెలంగాణ అమ్మ
తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గోన్నారు. ఆ సందర్బంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోనియా గాంధీ బహిరంగ సభ భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో కీలకపాత్ర పోషించిన సోనియా గాంధీకి గౌరవం ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెయ్యాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు మనవి చేశారు.
బర్త్ డే గిఫ్ట్ మిస్
60 ఏళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి సోనియా గాంధీ ముందుకు వచ్చారని ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరందరూ ఓట్లు వెయ్యాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి మనవి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సోనియా గాంధీకి పుట్టిన రోజు బహుమతి ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలెంజ్ చేశారు.
గాలికి వదిలేశారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి సోనియా గాంధీ కారణం అయ్యారని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే ప్రచారం చేశారు. సోనియా గాంధీ లేరంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొదటసారి ఇక్కడ అడుగు పెట్టిన సోనియా గాంధీ మాటకు మీరు గౌరవం ఇచ్చి మహాకూటమికి ఓట్లు వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన మనవిని తెలంగాణ ప్రజలు గాలికి వదిలేశారు.
ఎవరి మాట వినరు ?
తెలంగాణలో సోనియా గాంధీతో ఎన్నికల ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్లాన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మాటకు విలువ ఇస్తారని, ఆమె ప్రచారం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతున్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ మాట తప్పా ఎవరి మాట వినరని నిరూపించారు.
సీనియర్లు ఇంటికి !
టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి మహాకూటమితో బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలైనారు. శాసన సభ ఎన్నికల్లో ఊహించని షాక్ కు గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికే పరిమితం అయ్యారు.