ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుగా ఉంది, తెలంగాణ వల్ల మాకు నష్టం: సోనియా గాంధీ
Recommended Video
హైదరాబాద్: వేదికపై ఉన్న కోదండరాం, గద్దర్, ఎల్ రమణ తదితర నేతలకు హృదయపూర్వక అభినందనలు అని, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నానని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
మేడ్చల్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఓ తల్లి తన సంతానం వద్దకు వెళ్తే ఎంతలా సంతోషపడుతుందో, తాను ఇప్పుడు అలా సంతోషపడుతున్నానని చెప్పారు. ఏళ్ల తర్వాత తన బిడ్డల వద్దకు వచ్చినట్లుగా ఉందని చెప్పారు. పెంపకం బాగాలేకుంటే పిల్లలు చెడిపోతారని, ఇప్పుడు ఈ పాలనలో తెలంగాణ పరిస్థితి అలాగే అయిందని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెరాస ప్రభుత్వాన్ని తరిమికొడతామన్నారు.
తెలంగాణ ఇవ్వడం వల్ల మాకు నష్టం జరిగింది కానీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో చాలా కష్టమైనదిగా భావించానని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల బాగోగులు తన కళ్ల ముందు ఉన్నాయని చెప్పారు. విభజన పెద్ద సమస్య అయినప్పటికీ, ఉభయ రాష్ట్రాల బాగోగులు చూసుకుంటూనే తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజల కలను సాకారం చేశామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, మాకు నష్టం జరిగినా ప్రజల కోసం మేం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రతి తల్లి తన సంతానం బాగుండాలని కోరుకుంటుంది
ప్రతి తల్లి కూడా తన సంతానం నిత్యం బాగుండాలని కోరుకుంటుందని, తాను కూడా అదే కోరుకున్నానని సోనియా గాంధీ చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏం చేయాలో అది చేయలేదన్నారు. ఏం జరగాలో అది జరరగలేదని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఇచ్చామని, కానీ అవి ఎక్కడ అన్నారు. వీటిలో ఒక్క వాగ్ధనాన్ని అయినా తెరాస సఫలీకృతం చేసిందా అని ప్రశ్నించారు. తాము తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం సరిగా అమలు కావడం లేదన్నారు.
వాళ్లే బాగుపడ్డారు
కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేసారిపోతున్నారని సోనియా గాంధీ చెప్పారు. ఉద్యమస్ఫూర్తిని గౌరవించి తాము తెలంగాణ ఇచ్చామని, కానీ ఆ స్ఫూర్తి కొనసాగలేదన్నారు. వాగ్దానాలను నెరవేర్చడంలో తెరాస సఫలం కాలేదన్నారు. కేసీఆర్ పాలనలో మహిళా సంఘాలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం, బంధుమిత్రులు మాత్రమే తెరాస పాలనలో బాగుపడ్డారన్నారు.
మాటమీద నిలబడని వాళ్లను నమ్మవద్దు, బాధిస్తోంది
మాట మీద నిలబడని వాళ్లను ప్రజలు నమ్మవద్దని సోనియా గాంధీ అన్నారు. తెలంగాణలోని పరిస్థితులు తనను బాధిస్తున్నాయని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజా జీవితాలు బాగుపడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో మీరు కన్న కలలు నెరవేరలేదన్నారు. తెరాస నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, కానీ తెరాస పాలనలో ప్రజలకు మేలు జరగలేదన్నారు. మీరు లోతుగా విశ్లేషించి కూటమిని గెలిపించాలని కోరారు. చివరగా జైహింద్, జై తెలంగాణ అని నినాదాలు చేశారు.కాగా, సోనియా గాంధీ ఎక్కడా కేసీఆర్ పేరు లేకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అంటూ తెలుగులో మాట్లాడారు.