కేసీఆర్ ఆపరేషన్: సోనియా తీవ్ర ఆగ్రహం, గుత్తా కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు తెరాసలో చేరుతుంటే ఉత్తమ్ చోద్యం చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
పార్టీలో గ్రూపులను అదుపు చేయలేకపోతున్నారని, ఎమ్మెల్యేల ఫిరాయింపులలోను ఉత్తమ్ నిలువరించలేకపోతున్నారని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్టీలో నాయకులు పరస్పరం కలహించుకోవడం, మరోవైపు నేతలు పార్టీని వీడి తెరాసలో చేరటాన్ని సోనియా సీరియస్గా తీసుకున్నారు.
కాంగ్రెస్కు షాక్, ఇక ఉండేది లేదు: వివేక్, గుత్తా సహా తెరాసలోకి జంప్
ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ను హైదరాబాద్కు వెళ్ళి ఉత్తమ్తో, మిగతా నాయకులతో చర్చించాల్సిందిగా ఆదేశించారు. దిగ్విజయ్ సింగ్ ఈ నెల 15న హైదరాబాద్కు రానున్నారు.
అదే రోజున టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం గాంధీ భవన్లో జరగనుంది. ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించి అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తారు.
గుత్తా ట్విస్ట్
ఇదిలా ఉండగా, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుత్తా తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని చెబుతుండటం ట్విస్ట్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెరాసలో చేరనున్నట్లు ప్రచారం జరగగాడ.. దానిని ఆయన తీవ్రంగా ఖండించారు.
పార్టీలో చివరి వరకూ ఉండేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాల నేతల మధ్య కోల్డ్వార్ జరుగుతుండడం, పార్టీ రాష్ట్ర నాయకత్వం వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే.