ఎలక్షన్ టైమ్ : వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్న సోనియా, రాహుల్ గాంధీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ పార్టీ బలోపేతంతో పాటు వచ్చే ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఇప్పటి నుంచే రచిస్తోంది .ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించారు. ఇకపై ప్రతి నెలా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీని కూడా రంగంలోకి దింపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో కొంత కష్టపడితే అధికారంలోకి రావొచ్చనేది కాంగ్రెస్ ఆశగా ఉంది.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండ్రోజుల తెలంగాణ పర్యటన విజయవంతంతో కాంగ్రెస్ పార్టీలో క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. తిరిగి కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుని బలమైన శక్తిగా ఎదుగుతుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల అంటే సెప్టెంబర్లో రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.
సోనియాగాంధీ కూడా తెలంగాణకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇద్దరు వేరు వేరుగా వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వేర్వేరుగా ప్రజాచైతన్య బస్సు యాత్రలో పాల్గొంటారని సమాచారం. సెప్టెంబర్ 1 నుంచి మలివిడత ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభించనుంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీచేయడంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ నుంచి కూడా బరిలోకి దిగుతారనే వార్తలు ఊపందుకున్నాయి.ఇది దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఓ భారీ బహిరంగ సభ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు రాహుల్ గాంధీ దక్షిణ తెలంగాణలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్ర చివరి దశకు చేరుకునే సరికి సోనియాగాంధీని ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ శాసనమండిలో విపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు. ఇదే క్రమంలో మరో చోట రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.