టీఆర్ఎస్కు చరమగీతం పాడాల్సిన టైం: రాహుల్, తెరాస ఎంపీ సహా కాంగ్రెస్లోకి కీలక నేతలు
హైదరాబాద్: ఇది ఎంతో చారిత్రాత్మకమైన సభ అని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. మేడ్చల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సోనియా గాంధీ మీ పక్కన నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటం, ఉద్యమం వల్ల రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను సోనియా అర్థం చేసుకున్నారని చెప్పారు.
అమరవీరుల త్యాగాలు, సోనియా సంకల్పంతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. సోనియా గాంధీ మాట్లాడారని, ఆ తర్వాత నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. నేను మొదటి మాటగా చెబుతున్నానని, తెలంగాణలో నాలుగేళ్ల ప్రజా వ్యతిరేక పాలన ఖతమైపోయిందని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితిలు జత కట్టాయని చెప్పారు.
తెరాసకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది
తెరాస పాలనకు చమరగీతం పాడాల్సిన సమయం వచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఏ కలల కోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో, ఆ కలలు నెరవేరలేదని, కాబట్టి ఆ కలల కోసం మహాకూటమి పని చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఒకే ఒక వ్యక్తి తనకు తోచింది చేస్తున్నారని, తద్వారా దుర్మార్గ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఓ కుటుంబం లాభం కోసం పని చేశారన్నారు.
సోనియా మాట్లాడాక ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు
తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేలా ప్రజాకూటమి పాలిస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్లుగా తెలంగాణ ఇచ్చిన సోనియా మాట్లాడిన తర్వాత తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. లక్షలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. కూటమిలో ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆశయాలు, విద్యార్థుల భవిష్యత్తు ఉందని చెప్పారు.
గడీల రాజ్యాన్ని కూల్చేందుకు
రాక్షస రాజ్యాన్ని, దొర గడీని కూల్చేందుకే అంతా కలిసి జట్టు కట్టామని రాహుల్ చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై సోనియాకు ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా ఇక్కడికి వచ్చి తన ప్రజల పట్ల తన ఆకాంక్షను చాటారన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు సోనియా ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు.
టీఆర్ఎస్ ఎంపీ సహా కాంగ్రెస్లోకి నేతలు
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీల సమక్షంలో తెరాస నుంచి బహిష్కరణకు గురైన రాములు నాయక్, యాదవ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.