వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలుసుకోనున్న ఇద్దరు తెలుగు సీయంల కుమారులు..!
హైదరాబాద్ : వచ్చేనెల ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు భారత్ నుంచి 100మంది ప్రతినిధుల బృందం హాజరుకానుంది. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ లు ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదేళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ సహా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య, రాజకీయ, ప్రభుత్వ, పౌర సమాజానికి చెందిన 3వేల మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో మన దేశం నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ బాదల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. మనదేశం నుంచి హాజరయ్యే ప్రతినిధుల బృందంలో వ్యాపార దిగ్గజాలు అజిమ్ ప్రేమ్జీ, ఆయన కుమారుడు రిషద్.. ముఖేశ్ అంబానీ దంపతులు, వారి కూతురు నిషా, కుమారుడు ఆకాశ్..
గౌతమ్ అదానీ, లక్ష్మి మిట్టల్, ఆనంద్ మహీంద్ర.. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తదితరులు ఉంటారు. జనవరి 21 నుంచి 25 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా యంగ్ విమెన్ ఎంటర్పోనీయర్స్ గా లోకేష్ భార్య బ్రహ్మణి, హీరో రాంచరణ్ భార్య ఉపాసన, మంచు లక్ష్మి లు కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.