తెలంగాణలో త్వరలోనే 20 వేల పోలీస్ ఉద్యోగాలు-హోంమంత్రి మహమూద్ అలీ కీలక ప్రకటన
రాష్ట్రంలో త్వరలోనే 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో ఇప్పటికే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలుచేశామన్నారు. ఆదివారం(జూన్ 13) సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.1 కోటితో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడారు.
రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని గతేడాది డిసెంబర్లోనే ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఆ తర్వాత పలుమార్లు దీనిపై ప్రకటనలు చేసినప్పటికీ... ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జునసాగర్ ఉపఎన్నిక కారణంగా నోటిఫికేషన్లు వేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఇదిగో... అదిగో... అంటూ ప్రకటనలైతే వస్తున్నాయని గానీ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారనే దానిపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల్లో మళ్లీ నిరాశ అలుముకుంది.
కొలువుల నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగానే చాలామంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో చేరారు. కొంతమంది సొంతంగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలు,సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యాయక నోటిఫికేషన్లు వస్తాయని భావించినప్పటికీ... ఇప్పటికీ ఎటువంటి ప్రకటన లేకపోవడంతో అసలు నోటిఫికేషన్లు వస్తాయో రావోనన్న సందిగ్ధంలో కూరుకుపోయారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు-నిధులు-నియామకాల కోసం అని... అలాంటిది ప్రభుత్వం ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు పలుమార్లు కొలువుల నోటిఫికేషన్లపై పలుమార్లు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ర్యాలీలు,ధర్నాలు,ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాయి. కొత్తగా పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల సైతం కొలువుల దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతమంది ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తూనే ఉంది. ఇకనైనా నోటిఫికేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.