సంచలనం : క్షుద్రబాబాకు జకీర్ నాయక్ తో లింకులు!?
హైదరాబాద్ : బంగ్లాలో ఉగ్రవాద ఘటన తర్వాత ముస్లిం మత బోధకడు జకీర్ నాయక్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన్న సంగతి తెలిసిందే. తాజాగా పాతబస్తీ ప్రాంతంలో హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో వెలుగుచూసిన క్షుద్రబాబాల బాగోతానికి జకీర్ నాయక్ కు లింకులు బయటపడడం చర్చనీయాంశంగా మారింది.
తాంత్రిక మహిమలతో పిల్లలకు పట్టిన సైతాన్ లను వదిలిస్తామంటూ.. చిన్నపిల్లలను మానసికంగా, శారీరకంగా వేధిస్తోన్న మొత్తం 16మంది క్షుద్రబాబాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఫయాజ్ మహమూద్ అన్సారీ(38) అనే ఓ క్షుద్రబాబా గతంలో జకీర్ నాయక్ వద్ద శిక్షణ తీసుకున్నట్టు తేలడం విషయాన్ని మరింత వివాదస్పదం చేస్తోంది.
క్షుద్రబాబాలు: పిల్లల చేతులూ కాళ్లూ కట్టేసి ఇనుప చీలలతో... (పిక్చర్స్)
హఫీజ్ బాబా నగర్ లో ఉండే ఫయాజ్ మహమూద్ అన్సారీపై మోతీనగర్ కు చెందిన ఖాదర్ మొహియుద్దీన్ సౌత్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అన్సారీ బాగోతం బట్టబయలైంది. తన భార్యను లోబర్చుకుని, తన కుమారుడికి దెయ్యం పట్టిందన్న సాకుతో, కుమారుడిని చిత్రహింసలు పెట్టి చంపే ప్రయత్నం చేశాడని మొహియుద్దీన్ పోలీసులకు తెలిపాడు.
మొహియుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్సారీ ఇంటి మీద దాడి చేసిన పోలీసులు.. అతని వద్ద ఉన్న ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చిన్నపిల్లలను చిత్రహింసలకు గురిచేసిన దాదాపు 30 వీడియోలు ఉన్నాయని దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు.
క్యాండిల్ వ్యాక్స్ ను చిన్నపిల్లల మర్మాంగాలపై పోయడం.. కాళ్లు చేతులు కట్టేసి సూదులతో ఒళ్లంతా గుచ్చడం.. వేడినీళ్లు ఒంటిమీద పోసి జననాంగాల్లోకి వేళ్లు జొప్పించడం.. వంటి అతి క్రూరమైన చర్యలు ఆ వీడియోల్లో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
డీసీపీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన అన్సారీ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, కుటుంబ సమస్యలు పరిష్కరిస్తాననే సాకుతో అనేకమంది మహిళలను లోబరుచుకున్నట్టు తెలియజేశారు. నగరానికి చెందిన మహిళలనే గాక కెనడా, సౌదీ, దుబాయ్, ఖతార్ లకు చెందిన పలువురు ఎన్నారై మహిళలను కూడా అన్సారీ మోసం చేసినట్టుగా విచారణలో తేలినట్టు తెలిపారు.
ఇంకా విస్మయం కలిగించే విషయమేంటంటే.. హైదరాబాద్ కు వచ్చేముందు వివాస్పద మత ప్రవచకుడు జకీర్ నాయక్ వద్ద తాను శిక్షణ పొందినట్టు విచారణలో అన్సారీ వెల్లడించాడు. కాగా, దీనిపై మరింత లోతుగా విచారించాల్సి ఉందన్నారు డీసీపీ.