విషాదం : తెలుగు సీనియర్ నటి కవిత కుమారుడు కరోనాతో కన్నుమూత
సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి చెందారు.హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రూప్ బుధవారం(జూన్ 15) తుది శ్వాస విడిచారు. రూప్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడగా... అప్పటినుంచి హోం క్వారెంటైన్లో ఉంటున్నారు. ఇదే క్రమంలో ఒక్కసారిగా అతని ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రూప్ కన్నుమూశారు. దీంతో కవిత ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది.
మరోవైపు,కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్తో పోరాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నటి కవిత విషయానికి వస్తే... ఆమె 1976లోనే చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల వయసులో ఓ మంజు అనే తమిళ సినిమాతో పాటు సిరిసిరి మువ్వ సినిమాలో నటించారు. తెలుగు,తమిళం,కన్నడ,మలయాళంలో కలిపి మొత్తం 300 పైచిలుకు సినిమాల్లో కవిత నటించారు. ప్రస్తుతం ఇటు తెలుగు,అటు తమిళంలో టీవీ సీరియళ్లతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఊహలు గుసగుసలాడే,తమిళంలో ఎండ్రెండ్రం పున్నగై సీరియళ్లలో నటిస్తున్నారు. కవిత కుమారుడి మరణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కోవిడ్ సెకండ్ వేవ్ తెలుగు చిత్రపరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర రంగంలో ఎంతోమందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే.గత నెలలో ప్రముఖ సినీ జర్నలిస్ట్,యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ తుమ్మల నర్సింహారెడ్డి(టీఎన్ఆర్) కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మెగాస్టార్ చిరంజీవి టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ ఖర్చుల కింద కొంత ఆర్థిక సాయం అందించారు.
Recommended Video
మరో సీనియర్ నటుడు గౌతం రాజు సోదరుడు సిద్దార్థ కూడా కరోనాతో గత నెల కన్నుమూశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తమ్ముడు మరణించాడని గౌతంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.రోగులలో మనోధైర్యాన్ని నింపాల్సిందిపోయి... మీ ఊపిరితిత్తులు పని చేయటం లేదు చనిపోతారని వాళ్లతోనే చెప్పి భయపెడుతున్నారని వాపోయారు.