రైతులకు అలర్ట్: తెలంగాణలో వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు మరో వారంలో.. కొద్ది రోజుల ముందుగానే కేరళను తాకనున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవానలు ముందుగానే రానున్నాయి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి జూన్ 10వ తేదీలోపు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కేరళలో మే 27న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, జూన్ మొదటి వారం నుంచి ఎండలు క్రమంగా తగ్గుతాయని పేర్కొన్నారు.

అండమాన్, నికోబార్ దీవులు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఉత్తర-దక్షిణ ద్రోణి పశ్చిమ పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగానే మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 లేదా ఆ తర్వాత వస్తాయి కానీ.. ఇటీవల వచ్చిన అసని తుఫాను అవశేషాల ప్రభావం కారణంగా మే 27నే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక సాధారణంగా తెలంగాణలో జూన్ 12న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి కానీ.. ఈసారి మాత్రం ఒక వారం ముందుగానే వస్తున్నాయని తెలిపారు. గత ఒకటి రెండు రోజులుగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి.