తెరాసలో చేరిన పది మంది టిడిపి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన పది మంది శాసనసభ్యులకు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి నోటీసులు ఇచ్చారు. ఇటీవల తెరాసలో చేరిన ఐదుగురు శాసనసభ్యులకు ఆయన నోటీసులు జారీ చేశారు.
తెరాసలో చేరిన తమ పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) నేతగా రేవంత్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్, వివేకానంద, సాయన్న, రాజేందర్ రెడ్డిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
గతంలో తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగెల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావులకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిపై అప్పుడు టిడిపి శాసనసభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన తెరాసలో చేరారు.
తెరాసలో చేరడమే కాకుండా తమ పది మందిని తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్కు లేఖ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై మధుసూదనాచారి న్యాయనిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై ఏం చేయాలనే విషయంపై స్పీకర్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.