స్పీకర్ నిర్ణయం కఠినమైనదే, కానీ తప్పదు: కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్పై సీఎం కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం కఠినమైనదే కానీ తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్పీకర్ నిర్ణయం అనంతరం మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడారు.
Recommended Video
సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు. 'మేం దాడి చేయాలనుకుంది గవర్నర్పైన.. స్వామిగౌడ్పై కాదు..' అని వాళ్లే చెబుతున్నారని, కాంగ్రెస్ సభ్యులు సభ బయట, లోపల కొనసాగిస్తున్న అరాచకాలకు ఈ ఘటనే పరాకాష్ట అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతల తీరు సిగ్గుచేటు...
ప్రత్యేక తెలంగాణ సాధించుకునే క్రమంలో గతంలో ఎన్నో ఘటనలు జరిగాయయని, కానీ అవన్నీ గతమని, ఇప్పుడు వాటి ప్రస్తావన అవసరమేలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు సభ లోపల, బయట ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఇంత అసహన వైఖరి సరికాదు, ఈర్ష్య, కక్షలు పెంచుకోవడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
చట్టాలకు లోబడి ప్రవర్తించాల్సిందే...
నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. నేరస్తుల విషయంలోగాని, అరాచక శక్తుల విషయంలోగాని సహించడం జరగదు. ఎవరైనా చట్టాలకు లోబడి ప్రవర్తించాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు.
చేసినవన్నీ చేసి మళ్లీ...
ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని తాము సమావేశాలకు ముందుగానే బీఏసీ సమావేశంలో చెప్పామని, అలాంటప్పుడు చర్చ పెట్టకుండా గొడవ చేయాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నించడం అనేది సభ్యుల హక్కు, ప్రశ్నలు వేయమనండి.. సమాధానాలు చెబుతాం అని ఆయన వ్యాఖ్యానించారు. చేసినవన్నీ చేసి మళ్లీ ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారని, స్వామిగౌడ్ను గాయపరిచి మళ్లీ ఆయనే నాటకమాడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.
గవర్నర్ ఉన్నారని కూడా చూడలేదు...
తమకు కాంగ్రెస్ నేతల గురించి ముందుగానే స్పష్టమైన సమాచారం వచ్చిందని, సభలో కూర్చోవడం వల్ల తమకేం ఒరిగేది లేదని భావించే గొడవ చేసైనా సరే సభలోంచి బయటికి వెళ్లాలనేది కాంగ్రెస్ నాయకుల భావన అని సీఎం కేసీఆర్ తెలిపారు. గవర్నర్ సభలో ఉన్న సమయంలో కనీస గౌరవం పాటించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
స్పీకర్ చర్య సరైనదే...
కాంగ్రెస్ నేతలు రభస చేయాలన్న ఉద్దేశంతోనే చేశారని అన్నారు. మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు అరుపులు, పెడబొబ్బలు అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అందరం ప్రజలకు బాధ్యులమేనని, అంతిమంగా ప్రజల వద్దకు వెళ్లాల్సిందేనని అన్నారు. చివరగా.. దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ సరైన చర్య తీసుకున్నారని భావిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.