ప్రత్యేక హోదాపై రగులుతున్న ఎపి: చంద్రబాబు నుంచి కెసిఆర్కు ఊరట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఊరట లభించినట్లే ఉంది. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రగిలిపోతుండడంతో చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై దృష్టి సారించే వెసులుబాటు లభించడం లేదు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటుకు ఓటు కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కెసిఆర్పై పోరాటానికి దిగారు.
సెక్షన్ 8ను హైదరాబాదులో అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ చంద్రబాబుపై ఎదురు దాడికి దిగే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ను ఇరికించేందుకు ఆయన సిద్ధపడ్డారు. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావు వంటి ఎపి మంత్రులు కెసిఆర్పై దూకుడుగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
కెసిఆర్పై పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా వివాదం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనతో ఎపికి ప్రత్యేక హోదా రాదని తేలడంతో రాష్ట్రంలోని విపక్షాలు చంద్రబాబుపైనా, బిజెపిపైనా పోరాటానికి దిగాయి. బంద్లు, ధర్నాలతో అట్టుడుకుతోంది.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్టంలో బస్సు యాత్ర చేపట్టారు. రేపు బంద్కు పిలుపునిచ్చారు. సోమవారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధర్నా చేశారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెసు కూడా ఆందోళనలను ఉధృతం చేసే పనిలో పడ్డారు. కాంగ్రెసు కార్యకర్త మునికోటి ఆత్మహత్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంభీర వాతావరణం ఏర్పడింది.
ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ నేతలు సమయం వెచ్చించాల్సిన స్థితిలో పడ్డారు. చంద్రబాబు ప్రతిపక్షాల తీరుపై ఇప్పటి వరకు స్పందించిన దాఖలు కనిపించడం లేదు. ఈ స్థితిలో కెసిఆర్పై పోరును సాగించలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ పాలక పార్టీ తెలుగుదేశం పడింది.
మరోవైపు, ఓటుకు నోటు కేసులో ఏ విధంగా ముందడుగు వేయాలనే విషయంపై తెలంగాణ ఎసిబి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విపక్షాలను ఎదుర్కోవడంలో మునిగిపోవడంతో కెసిఆర్కు ఊరట లభించినట్లయింది.