యోగేంద్ర యాదవ్, ఢిల్లీలో ఏఏపీ: టిలో కోదండ నేతృత్వంలో జాప్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది.
ఏఏపీ తరహాలో తెలంగాణలో జాయింట్ యాక్షన్ పార్టీ (జాప్) రావొచ్చునని పేర్కొంది. భావసారుప్య శక్తులను కలుపుకొని సంపూర్ణ తెలంగాణ సాధనకు కృషి చేసే అవకాశాలున్నాయని, జాప్కు కోదండరామ్ నాయకత్వం వహించవచ్చునని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని పేర్కొంది.
మరోసారి సకల జనులను ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. కోదండ నేతృత్వంలో కొత్త శక్తులు పురుడు పోసుకునే అవకాశాలున్నాయంటున్నారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ముఖ్య కారకుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్ తెలంగాణలో కోదండతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ నెల 10వ తేదీన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని విశ్వసనీయ వర్గాలు వివరించాయంది.
ఏఏపీ నుంచి బయటకు వచ్చాక యోగేంద్ర యాదవ్ స్వరాజ్ అభియాన్ అనే కొత్త వేదికను ప్రారంభించారు. దీని ద్వారా ఆయా రాష్ట్రాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై యోగేంద్ర దృష్టి పెట్టారని పేర్కొంది.
కోదండ, యోగేంద్ర పలుమార్లు భేటీ అయినట్లుగా తెలుస్తోందని పేర్కొంది. వారిద్దరి మధ్య సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గతంలోనే ఏఏపీకి తెలంగాణ కన్వీనర్గా ఉండాలని కోదండకు యోగేంద్ర ఆఫర్ చేశారని, దానిని ఆయన తిరస్కరించారని తెలుస్తోందని పేర్కొంది. అయితే, ప్రస్తుతం యోగేంద్ర, కోదండలు కలిసి పని చేసేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొంది.
సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం అన్న కోదండ వ్యాఖ్యల్లో అంతరార్థం ఉందని కూడా అంటున్నారంటున్నారు. ఆప్ తరహాలో తెలంగాణలో జాప్ పైన కోదండరామ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోందని పేర్కొంది.