బీజేపీ భారీ స్కెచ్... కేసీఆర్కు స్పాట్... అదే జరిగితే టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయం...
ప్రముఖ తెలుగు దినపత్రిక నవ తెలంగాణ ఆదివారం(జనవరి 3) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త,ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మై హోమ్ రామేశ్వరరావు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది దాని సారాంశం. ఈ వార్తా కథనం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే గనుక నిజమైతే ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను,ముఖ్యంగా టీఆర్ఎస్ రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకరకంగా చూస్తే కేసీఆర్కు ఇది కోలుకోలేని దెబ్బ. టీఆర్ఎస్ పతనానికి దారులు వేయాలంటే ముందు దాని ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలన్న వ్యూహం దీని వెనకాల ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఆ కథనంలో ఏముంది...
ఆ కథనం ప్రకారం... మరికొద్ది రోజుల్లోనే మై హోమ్ రామేశ్వరరావు బీజేపీలో చేరబోతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపించనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్కు అన్ని విధాలా అండగా ఉంటూ వస్తున్న రామేశ్వరరావుకు ఇటీవల కేసీఆర్తో విబేధాలు తలెత్తడం వల్లే ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడం.. గతంలో ఆయన సంస్థలపై ఈడీ దాడుల దృష్ట్యా రామేశ్వరరావు బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ వ్యూహమేనా..
ఇటీవల దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్న సంకేతాలను బలంగా పంపించాయి. ఈ నేపథ్యంలో 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కమలం పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇటు రాష్ట్ర నాయకత్వం పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయగా.. అటు కేంద్రం కేసీఆర్కు చెక్ పెట్టే వ్యూహాల్లో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు,టీఆర్ఎస్కు ఆర్థిక అండ దండలు అందిస్తున్న మై హోమ్ రామేశ్వరరావును బీజేపీలోకి లాగుతున్నారన్న చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్ పునాదులు కదిలించే వ్యూహం...
తెలంగాణలో టీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలంటే ముందు దాని ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్కు ఆర్థిక అండదండలు అందిస్తున్నవారిని ఒక్కొక్కరిగా కేసీఆర్కు దూరం చేయగలిగితే భవిష్యత్తులో టీఆర్ఎస్ దానంతట అదే పతనమవుతుందన్న వ్యూహం దీని వెనకాల ఉన్నట్లు అర్థమవుతోంది. మై హోమ్తో మొదలై మున్ముందు మరింత మందిని కేసీఆర్కు దూరం చేయవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నయానో,భయానో వీరిని దారికి తెచ్చుకుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పునాదులను పెకిలించవచ్చునని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన... అనూహ్య పరిణామాలు...
ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. కేంద్రంపై ఇక యుద్దమే అంటూ ఒంటి కాలిపై లేచిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను శరణు వేడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్రం చేతిలో వున్న దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి ఆయన సరెండర్ అయ్యారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
కేసీఆర్కు ఈ సలహా ఇచ్చినవాళ్లలో మై హోమ్ రామేశ్వరరావు లాంటి పెద్దలు కూడా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన చుట్టూ ఇంత చర్చ జరుగుతున్నా... ఇన్ని విమర్శలు వస్తున్నా కేసీఆర్ గానీ టీఆర్ఎస్ అగ్ర నేతలు గానీ ఇప్పటికీ ఈ ప్రచారాన్ని ఖండించలేదు. దీనర్థం ఇక కేసీఆర్ చేతులెత్తేసినట్లేనని... రాష్ట్రాన్ని బీజేపీకి వదిలేయాలనుకుంటున్నారని కొంతమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మరో కోణంలో చూస్తే...
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒకటేనని చాలాకాలంగా విమర్శలు చేస్తోంది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కోణంలో ఆలోచిస్తే మై హోమ్ రామేశ్వరరావు బీజేపీలో చేరడాన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు.
అంటే,కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించేందుకు కేసీఆరే ఆయన్ను బీజేపీలోకి పంపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలగకమానవు. అయితే ఏ రకంగా చూసినా రామేశ్వరరావు బీజేపీలో చేరడం టీఆర్ఎస్కు నష్టమనే చెప్పాలి. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న వేళ... రామేశ్వరరావు లాంటి ఆర్థిక శక్తులు టీఆర్ఎస్కు దూరమైతే ఆ పార్టీకి కష్టాలు మొదలవుతాయి. మొత్తం మీద టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు బీజేపీ వేగంగా వ్యూహాలు అమలు చేస్తుండగా... బీజేపీకి చెక్ పెట్టే వ్యూహాలు టీఆర్ఎస్ వైపు నుంచి ఒక్కటీ కనిపించట్లేదు.