టీపీసీసీ చీఫ్గా జీవన్ రెడ్డి ఫిక్స్..? రేవంత్ రాజీ పడ్డట్టేనా.. అందుకే స్వరం మారిందా...?
తెలంగాణ కాంగ్రెస్లో గత కొద్దిరోజులుగా టీపీసీసీ చీఫ్ పదవిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. తొలి నుంచి పార్టీలో ఉన్నవారికే ఆ పదవిని కట్టబెట్టాలని ఒక వర్గం... ఇప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మరో వర్గం... ఇలా కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ విభేదాలు,చర్చలు ఎక్కువగా రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. పీసీసీ పదవిని రేవంత్కే కట్టబెట్టాలని అధిష్టానం ఫిక్స్ అవడం వల్లే సీనియర్లు తిరగబడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా రేవంత్ను కాకుండా మరో సీనియర్ నేతకు ఈ పదవిని కట్టబెట్టబోతున్నట్లు లీకులు వస్తున్నాయి.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సీనియర్ల వ్యతిరేక స్వరంతో కాంగ్రెస్ హైకమాండ్ వెనుకడుగు వేసిందో... లేక మాణిక్కం ఠాగూర్ రిపోర్టు ఆధారంగానే ముందుకు వెళ్తుందో తెలియదు గానీ మొత్తానికి నిన్న మొన్నటిదాకా టీపీసీసీ చీఫ్ రేసులో ముందు వరుసలో వినిపించిన రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ,సీనియర్ నేత జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఖరారు చేసినట్లుగా లీకులు వస్తున్నాయి. దీనిపై మంగళవారం(జనవరి 5) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మారిన రేవంత్ స్వరం...
టీపీసీసీ చీఫ్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇటీవల తన స్వరం మార్చారు. పీసీసీ కంటే తనకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అప్పగిస్తే బాగుంటుందని ఆయనే స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన శైలికి,పనితీరుకు క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ అయితేనే పక్కాగా సూట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. పీసీసీగా పార్టీలో నేతలను సమన్వయం చేసే బదులు... ప్రజల కోసం పాదయాత్ర చేయడమో,ప్రభుత్వంపై కొట్లాడటమో తనకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ప్రధాని కాకముందు మోదీ సైతం ప్రచార కమిటీ ఛైర్మన్గానే పనిచేశారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వాలని అడిగితే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారని అన్నారు.
రేవంత్ రాజీ పడ్డారా...?
ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అయితే తనకు సూట్ అవుతుందని రేవంత్ పేర్కొనడం టీపీసీసీ విషయంలో ఆయన రాజీపడ్డారా అన్న చర్చకు తెరలేపింది. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పీసీసీ ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్కు సంకేతాలు పంపించిందా... అందుకే ఆయన స్వరం మారిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికైనా సీఎం కుర్చీలో కూర్చోవాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్... ఆ పదవికి షార్ట్ కట్గా భావించే టీపీసీసీని త్యాగం చేయాలనుకోవడం ఆశ్చర్యపరిచే విషయమే. పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే ఆయన ఇలా వెనక్కి తగ్గుతున్నారన్న చర్చకు ఈ పరిస్థితులు ఆస్కారం కల్పించాయి.
రెండు పదవులు రెడ్లకే ఇస్తారా?
టీపీసీసీ,ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు రెండింటినీ రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే పార్టీలో మళ్లీ విభేదాలు రావొచ్చు. ఇదే విషయంపై అధిష్టానం కూడా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎలాంటి అడ్డంకులు లేవని భావిస్తే పీసీసీ చీఫ్ పదవిని జీవన్ రెడ్డికి,ప్రచార కమిటీ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డికి పార్టీ నేతలందరితో సఖ్యత ఉండటం... ఆయన్ను నియమమిస్తే పార్టీలో విభేదాలకు ఆస్కారం ఉండదన్న ఉద్దేశంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2006,2008 కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పోటీ చేసి ఓటమి చవిచూశారు.