బాబు పెంపుడు కుక్క: సుమన్, ఒరిజినల్ టీఆర్ఎస్ నేతలూ.. తిరగబడండి: శ్రవణ్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్ శుక్రవారం మండిపడ్డారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క రేవంత్ అన్నారు. తెలంగాణ పాలన పైన అబద్దపు ప్రచారం చేస్తే రేవంత్ నాలుక కోస్తామన్నారు.
చంద్రబాబు అవినీతి ఎండగట్టడమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ బెయిల్ పైన విడుదల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ను, మంత్రులను ఏకిపారేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ ద్రోహులను కేసీఆర్ కేబినెట్లో చేర్చుకున్నారని ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. తలసాని, కడియం, తుమ్మల వంటి నేతలు ఎప్పుడూ తెలంగాణ గురించి మాట్లాడలేదని చెబుతున్నారు.
తిరగబడండి: దాసోజు శ్రవణ్
టీఆర్ఎస్లో ఎంతోకాలంగా ఉండి పార్టీకి సేవలు చేస్తున్న అసలైన నేతలు తిరగబడితేనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు దక్కకుండా ఉంటాయని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న డీ శ్రీనివాస్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఒరిజినల్ టీఆర్ఎస్ నేతలు తిరగబడాలన్నారు. డీ శ్రీనివాస్ ఓ కోవర్టు అని, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం మంచిదే అన్నారు. బీసీల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని ఆయన చెప్పడం విడ్డూరమన్నారు. టీఆర్ఎస్లో నష్టపోయింది బీసీలే అన్నారు.
ఆదరణ చూడలేకే: వివేక్, రేవంత్పై మరో ఫిర్యాదు
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేసులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే వివేక్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. టీఆర్ఎశ్ ర్యాలీలు తీస్తే ఎప్పుడైనా కేసులు పెట్టారా అని ప్రశ్నించారు. మరోవైపు, అనుమతిలేకుండా ర్యాలీ నిర్వహించారని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.