మహేష్ కత్తిని క్షమించా: పరిపూర్ణానందస్వామి, 'బహిష్కరణ'పై అమిత్ షా ఆగ్రహం
కాకినాడ: తాను మహేష్ కత్తిని క్షమిస్తున్నానని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి శుక్రవారం అన్నారు. అతను ఓ బోయవానిగా మాట్లాడినా వాల్మీకిగా మారగలడని ఆకాంక్షించారు. ఉన్నత విద్యావంతులు కూడా రామనామం గురించి తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
పాత ప్రసంగం! పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ: 'ఇదో బ్లాక్ డే'
చట్టాలు కఠినంగా ఉంటే మత సంస్కృతులపై దాడులు జరగవని ఏ సంస్కృతి పైన దాడులు జరగవని చెప్పారు. త్వరలో మహేష్ కత్తి రాముడి గురించి తెలుసుకుంటాడని చెప్పారు. పరిపూర్ణానంద స్వామి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు.
విద్యను అభ్యసించే వారికి రాముడి గొప్పతనం, చరిత్ర గురించి చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎవరి మతం వారు ఆచరిస్తే ఇబ్బందులు ఉండవని చెప్పారు. మతాలను కించపరచకుండా ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
అమిత్ షా ఆగ్రహం?
కత్రియా హోటళ్లో ఆరెస్సెస్ భేటీలో పరిపూర్ణానంద స్వామని నగర బహిష్కరణ చేసిన అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. హిందువులు అందరూ ఏకమై స్వామీజీకి పూర్తిగా మద్దతివ్వాలని ఆరెస్సెస్ నేతలో అన్నారని తెలుస్తోంది.
ఆరెస్సెస్ కార్యకర్తలు వెనక్కి తగ్గవద్దని ఆదేశించారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తిని శిక్షించకుండా, పరిపూర్ణానందను నగర బహిష్కరణ ఎలా చేస్తారని ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యానించారని సమాచారం.