హైదరాబాద్కు మరో ఐటీ దిగ్గజం సేల్స్ఫోర్స్, కేసీఆర్తో సన్రైజర్స్ ఓనర్ భేటీ
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 9 కప్ గెలుచుకోవడం తెలంగాణకు, హైదరాబాదుకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జట్టు క్రికెటర్లు, యాజమాన్యాన్ని అభినందించారు. సన్ రైజర్స్ జట్టు యజమాని, సన్ గ్రూప్ ఎండీ కళానిధి మారన్, సీఈవో షణ్ముగం, జెమిని టీవీ ఎండీ కిరణ్ తదితరులు గురువారం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. కప్ గెలుచుకోవడం మనకు గర్వకారణమని చెప్పారు. తమ జట్టును ఆది నుంచి ప్రోత్సహించినందుకు జట్టు యాజమాన్యం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాదులోని మ్యాచులకు ప్రభుత్వం సహకరించిందన్నారు.
వచ్చే సీజన్లో తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ హైదరాబాదులోనే జరుగుతాయని, ఈ మ్యాచులకు రావాలని కేసీఆర్ను కళానిధి మారన్ ఆహ్వానించారు. దీనికి సీఎం అంగీకరించారు. ఐపీఎల్ ప్రారంభాన్ని, ముగింపును ఇక్కడే ఘనంగా నిర్వహిద్దామన్నారు.
హైదరాబాదుకు ఐటీ దిగ్గజం
అమెరికాకు చెందిన మరో దిగ్గజ కంపెనీ తెలంగాణపై ఆసక్తి కనబర్చింది. ఇప్పటికే గూగుల్, ఆపిల్ వంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్లో కార్యకలాపాలను ప్రారంభించనుండగా, తాజాగా మరో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ఫోర్స్ తన భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.
వేయి మంది ఉద్యోగులతో కొలువుదీరనున్న ఈ కార్యాలయం ప్రారంభంపై వచ్చే వారంలోనే ప్రకటన చేయనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం శాన్ఫ్రాన్సిస్కోలోని సేల్స్ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ అత్యున్నత ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి సేల్స్ఫోర్స్ బృందానికి వివరించారు. సమావేశం ముగిసిన వెంటనే హైదరాబాద్లో కార్యాలయం ప్రారంభంపై సేల్స్ఫోర్స్ నిర్ణయం వెలువరించటం విశేషం. ఆ కంపెనీ ఉన్నతస్థాయి అధికారులు వచ్చేవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు.
ఇదిలా ఉండగా, సిలికాన్ వ్యాలీ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రిబ్రౌన్తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీల ప్రధాన అంశాలను వివరించారు.
అనంతరం వారిద్దరు శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచంలోని పదమూడు ప్రావిన్స్ల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆహ్వానం దక్కింది.
ఈ సమావేశంలో తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో సహకారంపై జెర్రిబ్రౌన్ సమక్షంలో కాలిఫోర్నియా క్లీన్ఎనర్జీ మినిస్టీరియల్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది.