ఉరేసుకుని ప్రాణం తీసుకుంది: శ్రీచైతన్య ఐఐటీ అకాడమీలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
హైదరాబాద్: నగర శివారులోని ఎల్బీనగర్ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న అన్వితారెడ్డి అనే విద్యార్ధిని వాష్ రూంలో ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. అన్వితారెడ్డి స్వస్థలం మహబూబ్నగర్.
అన్వితారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రలకు సమాచారమిచ్చింది. దీంతో మహబూబ్ నగర్ నుంచి తల్లిదండ్రులు హైదరాబాద్కు హుటాహుటిన బయల్దేరారు. అన్వితారెడ్డి మరణంతో అకాడమీలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థినులు సైతం షాక్కు గురయ్యారు.
విద్యార్ధిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్ధిని ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు. కాలేజీ లోపలికి ఎవరినీ రానివ్వకుండా సిబ్బంది గేటుకి తాళాలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె కొన్ని రోజులుగా ఫోన్లో ముభావంగా మాట్లాడుతోందని చెబుతున్నారు. విద్యార్ధిని మృతదేహాన్ని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.