లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది . ఇక పోలీసులు , ప్రజా ప్రతినిధులు ప్రజలు బయటకు రాకుండా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు . కొందరు ప్రజా ప్రతినిధులు ప్రజలకు కావాల్సిన నిత్యాసరాలను అందిస్తున్నారు. మరి కొందరు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు కూడా కరోనాపై జరుగుతున్న పోరాటంలో నేను సైతం అంటూ ముందుకు వస్తున్నారు.
ఇక నిన్నటికి నిన్న రోడ్డు మీద వాహనదారులకు హరీష్ కరోనా వైరస్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దయచేసి ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఇక తాజాగా రేపటి శ్రీరామనవమి గురించి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపధ్యంలో శ్రీరామ నవమి ఎలా జరుపుకోవాలో హరీష్ పేర్కొన్నారు. స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు . శ్రీరామ నవమి సందర్భంగా బయట కళ్యాణాలు నిర్వహించి గుంపులుగా ప్రజలు ఒక్క చోట చేరవద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు సూచించారు . అంతే కాదు శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
అందరం శ్రీరాముడ్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారనీ చెప్పిన హరీష్ ఆయన బాటలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనందరి విశ్వాసాన్ని వినాశనం చేసేలా దాపురించిన మహమ్మారి కరోనాని మనో ధైర్యం తో తరిమికొడదామని హరీష్ రావు పిలుపునిచ్చారు . కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పిన హరీష్ ఆరుబయట కాకుండా ఆలయాల్లో మాత్రమే కేవలం అర్చకుల సమక్షంలోనే శ్రీ సీతారామ కళ్యాణం చేయాలన్నారు. అందరం ఇళ్ళల్లో రాముడ్ని పూజించి లైవ్ లో వచ్చే కళ్యాణం వీక్షిద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు .