ఓయు విద్యార్థుల ధర్నా, శ్రీరెడ్డి ఇష్యూలో ట్విస్ట్: టీవీ9 రవిప్రకాశ్పై 'అసభ్యకర' సృష్టికర్త ఇతనే!
Recommended Video
హైదరాబాద్: సినీ నటి శ్రీరెడ్డికి 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నుంచి ఊరట లభించింది. ఆమెపై నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు మా అసోసియేషన్ గురువారం రాత్రి ప్రకటన చేసింది. ఆమెకు పలువురు సినీ ప్రముఖుల మద్దతుతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మద్దతు కూడా లభించింది.
చదవండి: శ్రీరెడ్డి ఇష్యూ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసు
'మా' ప్రకటనకు ముందు శ్రీరెడ్డికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఫిలిం చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి తరలించారు.
ముగిసిపోని శ్రీరెడ్డి వివాదం!
శ్రీరెడ్డి వివాదం ముదురుతుండటంతో మా మెట్టు దిగిన విషయం తెలిసిందే. ఆమెపై నిషేధం ఎత్తివేశారు. దాంతో పాటులైంగిక వేధింపుల నియంత్రణ కోసం కాష్(కమిటీ అగైన్స్ట్ సెక్సువల్ హెరాస్మెంట్)ను ఏర్పాటు చేసినట్లు 'మా' అధ్యక్షులు శివాజీ రాజా తెలిపారు. మహిళా నటులపై లైంగిక వేధింపులను అరికట్టడమే దీని ప్రధాన లక్ష్యమని 'మా' తెలిపింది. ఇందులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు, దర్శక నిర్మాతలు ఉంటారు. మూడు నెలలకొకసారి జరిగే సమావేశంలో ఎవరెవరికి సభ్యత్వాలు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే, దీనిపై శ్రీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఓ చానల్ డిబెట్లో మాట్లాడుతూ.. తనకు కనీసం 20 శాతం సంతోషం కూడా లేదన్నారు. తనపై వరాల జల్లు ఏమీ కురిపించలేదన్నారు. అవకాశాలు, మా సభ్యత్వం తన హక్కు అని, వాళ్లు ఇవ్వకపోయినా ఏదో ఒక మార్గంలో కచ్చితంగా తెచ్చుకునే దానిని అని చెప్పారు. మేం అనుకున్న డిమాండ్స్ పైన స్పందన రాలేదన్నారు. కాబట్టి వెనక్కి తగ్గే సమస్య లేదని, పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
వారి సంగతేమిటి?
ముఖ్యంగా కో ఆర్డినేషన్స్ సిస్టమ్, కెమెరామెన్స్ అంతా బయటి నుంచి వస్తున్నారని వాళ్ల సంగతేమిటి అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. అలాగే థియేటర్స్ గురించి ఇలా ఏ విషయంలోను 'మా' సరిగ్గా స్పందించలేదని వాపోయారు. డబ్బా రేకుల సుబ్బారాయుడిలాగా చెబితే తాము వినే ప్రసక్తి లేదని, సమస్యలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. తమ డిమాండ్లపై తాము పోరాడుతామని చెప్పారు.
జూనియర్ ఆర్టిస్ట్ల నుంచి హీరోయిన్ల దాకా వేధింపులు
సినీ పరిశ్రమలో ఆర్థిక, లైంగిక దోపిడీ జరుగుతోందని పలు మహిళా సంఘాల నేతలు బుధవారం ఆరోపించారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. శ్రీరెడ్డి నిరసనతో ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. శ్రీరెడ్డి నిరసన నేపథ్యంలో చాలామంది ఆర్టిస్టులను కలిసి వాస్తవాలపై సమాచారం సేకరించినట్లు తెలిపారు.
శ్రీరెడ్డికి క్షమాపణ చెప్పాలి
శ్రీరెడ్డి నిరసనకు 'మా' స్పందించిన తీరు అవమానకరంగా ఉందని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే 'మా' ఆమెకు క్షమాపణ చెప్పాలన్నారు. అంతకుముందు మహిళా సంఘాల నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. చిత్ర పరిశ్రమలో మహిళలను రక్షించేందుకు ఓ కమిటీని వేయాలని వినతిపత్రం అందించారు.
పవన్ కళ్యాణ్, కేటీఆర్, కవితలు మాట్లాడాలని
తమ డిమాండ్లు, నిరసనలపై టీఆర్ఎస్ ఎంపీ కవిత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడకపోవడం బాధ కలిగించిందని శ్రీరెడ్డి అంతకుముందు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని కోరారు. పవన్ ఇండస్ట్రీ నుంచి పైకి వచ్చారని, పరిశ్రమ వల్లే అభిమానులు ఉన్నారని, ఇలాంటి సినిమా ఇండస్ట్రీని వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన పట్టించుకోనంటే తప్పని, ప్రజల సమస్యలపై మీరు (పవన్) మాట్లాడుతున్నారని, ఇండస్ట్రీపై కూడా మాట్లాడాలని శ్రీరెడ్డి.. పవన్ను కోరారు. ఇది మహేష్ కత్తి వ్యవహారం కాదని, ఆడపిల్ల వ్యవహారం అన్నారు.
ఈ కారణంగా మెట్టు దిగిన 'మా'
శ్రీరెడ్డి అంశంపై మహిళా సంఘాల నేతలు రంగంలోకి దిగడం, పరిశ్రమలో మహిళల రక్షణకు కమిటీ వేయాలని డిమాండ్ చేయడం, మరోవైపు ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవడం, ప్రభుత్వాల వరకు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో 'మా' ఓ మెట్టు దిగినట్లుగా భావిస్తున్నారు.
అసభ్య సందేశం సృష్టించిన వ్యక్తిపై కేసు
మరోవైపు, శ్రీరెడ్డి-టీవీ 9 ఛానల్ సీఈవో రవిప్రకాశ్ మధ్య అసభ్యకరమైన సంభాషణలు సృష్టించిన వ్యక్తిపై సదరు టీవీ ఛానల్ అడ్మిన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడ్ల శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి అసభ్యకర సంభాషణలు సృష్టించి వాటిని వాట్సప్లో కొందరికి పంపి ఆ తర్వాత ఫేస్బుక్లో పెట్టాడు. బుధవారం విషయం గుర్తించిన ఛానల్ ప్రతినిధి పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై పీడీ నాయుడు ఫిర్యాదును స్వీకరించారు. ఫిర్యాదును సీసీఎస్కు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదిలా ఉండగా,టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ నిర్మాతలు, దర్శకులు, హీరోలపై ఆరోపణలు చేస్తూ శ్రీరెడ్డి సంచలనం సృష్టించారు. ఇటీవల దర్శకులు శేఖర్ కమ్ముల తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫేస్బుక్లో ఆరోపణలు చేశారు. దాంతో షాక్కు గురైన శేఖర్ కమ్ముల వెంటనే ఫేస్బుక్ ద్వారా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తానెలాంటి వాడినో చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులకు కూడా తెలుసని అనవసరంగా తనపై బురద జల్లాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలన్నారు. శేఖర్ కమ్ముల సీరియస్ అవడంతో శ్రీరెడ్డి మాట మార్చారు. ఏదో సరదాగా ఇలా అన్నానని అవన్నీ నిజం కాదని పోస్ట్ చేశారు. ఆ తర్వాత రచయిత కోన వెంకట్పై ఆరోపణలు చేశారు. వెంకట్ తనతో అసభ్యంగా చాటింగ్ చేసేవారంటూ మెసేజ్ల స్క్రీన్ షాట్లు పోస్ట్ చేశారు. దీనిపై కోన వెంకట్ స్పందిస్తూ.. ఓ నటి సినీ ప్రముఖలతో పాటు తనపై కూడా ఆరోపణలు చేయడం చూసి షాకయ్యానని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నానని, నిజం బయటపడాలని, లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగింది.
చేతులెత్తి కోరుతున్నది ఒకటే.., టీవి9 'రవి ప్రకాశ్'పై ప్రచారం ఫేక్: శ్రీరెడ్డి