టాలీవుడ్లో మహిళలపై వేధింపులు, త్వరలో ఢిల్లీకి వెళ్తా: ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి
హైదరాబాద్: స్త్రీల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించిన నటి శ్రీరెడ్డి శుక్రవారం మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నంను కలిశారు. మూడు గంటల పాటు భేటీ అయ్యారు.
టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్తో చర్చించారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ పరిశ్రమలోని పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరిస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ హామీ ఇచ్చారని చెప్పారు.
త్వరలో ఢిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్ను కూడా కలిసి ఈ విషయంపై పిర్యాదు చేస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం ఉందని మహిళా సంఘం నాయకురాలు సంధ్య అన్నారు. అందుకే ఏ సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం దొరకటం లేదన్నారు. మహిళా ఆర్టిస్టులకు ఉపాధి, భద్రత కల్పించాలన్నారు.