కాలేజీలో వైష్ణవ్ ఎలా ఉండేవాడంటే!: దత్తాత్రేయ కుమారుడి మృతిపై శ్రీచైతన్య ప్రిన్సిపాల్
Recommended Video
హైదరాబాద్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గురించి నారాయణగూడ శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి ఆసక్తికర విషయాలు తెలిపారు.
వైష్ణవ్ మృతి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పిన ఆమె.. అతని కలుపుగోలుతనం గురించి, సేవా గుణం గురించి మరోసారి గుర్తుచేసుకున్నారు. కాలేజీలో ఎన్నడూ అతనో ఎంపీ కుమారుడిలా ప్రవర్తించలేదని, ఆ ప్రస్తావనే రాకుండా చూసుకునేవాడని అన్నారు.
కాగా, నారా యణగూడలోని శ్రీ చైతన్య కళాశాలలో 2012 నుంచి 2014 వరకు వైష్ణవ్ ఇంటర్ చదివాడు. ఆ తర్వాత ఎంబీబీఎస్ లో చేరాడు.
వైష్ణవ్ గురించి మరిన్ని విషయాలు చెబుతూ.. కాలేజీలో ఎవరికి ఏ ఆపద వచ్చిన అతను స్పందించేవాడని ప్రిన్సిపాల్ సరస్వతి చెప్పారు. తన తండ్రితో మాట్లాడి తగిన సహాయం అందేలా ప్రయత్నించేవాడన్నారు.
గతంలో ఓ అధ్యాపకుడి కూతురు అనారోగ్యంతో అమెరికాలో చనిపోయిన సందర్భంలో.. ఆమె మృతదేహాన్ని త్వరితగతిన ఇక్కడికి తీసుకొచ్చేందుకు వైష్ణవ్ ఎంతో కృషిచేశాడని చెప్పారు. మరో సందర్భంలో.. నేపాల్ లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లి భూకంపం వచ్చిన సమయంలో అక్కడే చిక్కుకుపోయిన మరో విద్యార్థినిని కూడా సురక్షితంగా రప్పించడానికి వైష్ణవ్ తనవంతు సహాయం చేశాడన్నారు.
విద్యార్థులకే కాకుండా, కాలేజీలో అధ్యాపకులు, అటెండర్లు ఎవరికి ఏ సమస్య వచ్చినా వైష్ణవ్ స్పందించేవాడని అన్నారు. 15రోజుల క్రితమే బంధువుల అమ్మాయి అడ్మిషన్ కోసం తమను సంప్రదించినట్టు సరస్వతి తెలిపారు.