మా పాపకు పునర్జన్మ, పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలి: శ్రీజ, తండ్రి ప్రత్యేక పూజలు
Recommended Video
భద్రాచలం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆయన అభిమాని శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం వారు స్వామివారికి పూజలు చేశారు.
పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంతో పాటు, ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా విజయాన్ని కాంక్షిస్తూ వారు పూజలు నిర్వహించారు. పాల్వంచకు చెందిన బండి నాగయ్య, ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గోత్రనామాల పేరిట పూజ చేశారు.
పవన్ వచ్చి మా పాపను పరామర్శించారు
ఈ సందర్భంగా బండి నాగయ్య విలేకరులతో మాట్లాడారు. ఈయన శ్రీజ తండ్రి. తమ పాప శ్రీజ 2014 సెప్టెంబర్లో బ్రెయిన్ ఫీవర్తో బాధపడుతూ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఖమ్మం వచ్చి చికిత్స పొందుతున్న తమ పాపను పరామర్శించారని గుర్తు చేసుకున్నారు.
పునర్జన్మ లభించింది
పవన్ కళ్యాణ్ రాకతో తమ పాపకు పునర్జన్మ లభించిందని బండి నాగయ్య అన్నారు. తమ పాపకు పునర్జన్మ ప్రసాదించిన పవన్ కళ్యాణ్ తమకు దేవుడు అని, ఆ దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.
అజ్ఞాతవాసి కూడా
అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్గా నిలవాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించినట్లు శ్రీజ తండ్రి తెలిపారు. కాగా, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.
శ్రీజను కలిసిన పవర్ స్టార్
కాగా, పాల్వంచకు చెందిన విద్యార్థిని శ్రీజ తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ను చూడాలనుకుంది. శ్రీజ కోరికను తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఆయనను సంప్రదించింది. పవన్ ఖమ్మం వెళ్లి ఆమెను కలిశారు.