స్ట్రెచర్పై పవన్ను కలిసిన అభిమాని: జనసేనానిపై మందకృష్ణ విమర్శలు
కొత్తగూడెం: ప్రజాయాత్రలో భాగంగా తాను అభిమానులను కలవడం కుదరడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవన్ తెలంగాణలో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన బుధవారం ఉదయం కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు.
Recommended Video
ఖమ్మం వరకు రోడ్డు షో: పవన్ కళ్యాణ్ లక్ష్యం 2019 కాదు, మరో 30 ఏళ్లు
ఈ సందర్భంగా మాట్లాడారు. తాను కొత్తగూడెంకు 2009లో వచ్చానని గుర్తు చేశారు. నాడు ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. కొత్తగూడెంలో అపారమైన ఖనిజ సంపద ఉందని చెప్పారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు.
ప్రభుత్వాన్ని కోరుతా
ఇక్కడి సింగరేణి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని తాను ప్రభుత్వాన్ని కోరుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన శ్రీజను పవన్ అక్కున చేర్చుకున్నారు. శ్రీజతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్ను కలిసిన అభిమాని
కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ను ఆయన అభిమాని గుబ్బల సతీష్ కలిశారు. ఆయనను స్ట్రెచర్ పైన అతని తల్లిదండ్రులు పవన్ వద్దకు తీసుకు వచ్చారు. అతని రెండు కాళ్లు పోయాయి. అతనిని చూసి పవన్ చలించిపోయారు.
అత్తారింటికి దారేది సమయంలో
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా విడుదల సమయంలో సతీష్ ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతనికి రెండు కాళ్లు పోయాయి. ఈ నేపథ్యంలో అతనిని స్ట్రెచర్ పైన ఇప్పుడు పవన్ వద్దకు తీసుకు వచ్చారు.
మరో 25 ఏళ్లు సిద్ధమా అంటూ ఫ్యాన్స్కు ప్రశ్న
మంగళవారం పవన్ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావం రోజైన మార్చి 14 లోపు మరో రెండుసార్లు కలుస్తానని చెప్పారు. తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని వివరించి యువకులను ఆకట్టుకున్నారు. మీ కుటుంబ సభ్యుల్లా, అన్నలా, తమ్మునిలా భావించమని, మీలో ఒకడినై నడుస్తానని, సమస్యల పోరాటానికి అవసరమైతే రోడ్డెక్కుతానంటూ ప్రసంగించడం అందరినీ ఆకట్టుకుంది. వచ్చే 25 ఏళ్ల పోరాటానికి సిద్ధమేనా అంటూ ప్రశ్నించగా సిద్ధమే అంటూ యువకులు ప్రతిస్పందించారు.
సినీ గ్లామర్తో తిరిగితే ఓట్లు పడవు
పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బుధవారం మందకృష్ణ మాదిగ కూడా ఆయనపై మండిపడ్డారు. సినీ గ్లామర్తో తిరిగితే ఓట్లు పడవని దుయ్యబట్టారు. పవన్ను తిప్పడానికి, మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులను పెడుతున్నారని మండిపడ్డారు. చట్టం అందరికీ సమానంగా న్యాయం చేయాలని మందకృష్ణ అన్నారు. దీనిపై గవర్నర్ నరసింహన్ను కలుస్తామని చెప్పారు. గతంలో 10 రోజులు దీక్ష చేసిన కేసీఆర్ను జైల్లో ఎందుకు పెట్టలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై గతంలో 307 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కానీ అరెస్ట్ చేయలేదని, చట్టం కొందరికే వర్తిస్తుందా అన్నారు. కేసీఆర్కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.