అవమానించారు.. త్యాగానికి ఇదా ఫలం, కేసీఆర్ న్యాయంచేశారు కానీ: శ్రీకాంతాచారి తల్లి ఉద్వేగం
హైదరాబాద్/యాదాద్రి: ప్రభుత్వం శ్రీకాంతాచారిని గౌరవిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు అవమానిస్తున్నారని తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తమను పిలిచి అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవమని, ఇలాంటి రోజు ఎవరో ఒకరు ఎమ్మెల్యే లేదా ఎంపీ వచ్చి శ్రీకాంతచారీ పుట్టిన ఊళ్లో పాల్గొనాలని ఆమె అన్నారు. అతను చనిపోయిన ఎల్బీ నగర్లో అయినా ఎమ్మెల్యే లేదా ఎంపీ పాల్గొనాలన్నారు. కానీ ఎవరూ అలా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాలకు వచ్చిన తనను అధికారులు అవమానించారని, దీనిపై తాను సీఎంకు ఫిర్యాదు చేస్తానన్నారు.
మరిన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల వార్తలు చదవండి
కేసీఆర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేశారని ఆమె చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చారని, రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశారన్నారు. ఇంకా చేస్తారన్నారు. కేసీఆర్ను, ఆ కుటుంబాన్ని తాను అనదల్చుకోలేదన్నారు. కానీ కిందిస్థాయి జిల్లా నాయకులు కొందరు శ్రీకాంతచారి త్యాగాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో శ్రీకాంతాచారి త్యాగం చేశారా, ఇప్పుడు సన్మానం చేయించుకుంటున్న వారు చేశారా అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సం అద్భుత చిత్రాలు చూడండి
గతంలో కూడా భువనగిరికి పిలిచి చివరగా పిలిచారని, ఈసారి కూడా తాను రావొద్దనుకున్నానని, కానీ కచ్చితంగా రావాలని చెబితే వచ్చానని, కానీ అందర్నీ పిలిచిన తర్వాత పిలిచారని, మొదట శ్రీకాంతాచారి త్యాగమా, వాళ్లందరిదా అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి నడిరోడ్డుపై పెట్రోలో పోసుకొని అమ్మానాన్న అనకుండా జై తెలంగాణ అన్నారని గుర్తు చేశారు.
కానీ ఈ రోజు శ్రీకాంతచారి చావుకు, త్యాగానికి అర్థం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. మరోసారి ఇలా శ్రీకాంతచారిని అవమానిస్తే భరించేది లేదన్నారు. శ్రీకాంతచారిలో తాను ఆత్మత్యాగానికి పాల్పడేందుకు సిద్ధమన్నారు.