శ్రీనివాస్ కూచిభొట్ల హత్య: ట్రంప్పై విరుచుకుపడ్డ న్యూయార్క్ టైమ్స్
అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ టైమ్స్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడింది.
న్యూయార్క్: తెలుగు టెక్కీలపై కాన్సాస్ దాడుల నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడింది. ఆ ఘటనపై మాట్లాడకపోవడం ద్వారా డోనాల్డ్ ట్రంప్ ద్వేషపూరిత నేరాలకు అవకాశం కల్పిస్తున్నారని ఆ పత్రిక తప్పు పట్టింది. ట్రంప్ మౌనం వహించడం ద్వారా దేశప్రతిష్టకు, శక్తిసామర్థ్యాలకు నష్టం చేస్తున్నారని అభిప్రాయపడింది.
కాన్సాస్ ఘటనపై ట్రంప్ మౌనాన్ని ప్రశ్నిస్తూ న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం రాసింది. పలువురు వలసదారులను, విదేశీ సందర్శకులను దేశానికి వెలుపల ఉంచేయడమే కాకుండా, వారిని నేరగాళ్లు, భవిష్యత్ ఉగ్రవాదులుగా, ఆక్రమణదారులుగా ట్రంప్, ఆయన ప్రభుత్వం ముద్ర వేస్తోందని వ్యాఖ్యానించింది. అమెరికా ఉద్యోగాలను దొంగిలించేవారిగా, అమెరికన్లకు అమెరికన్లకు ప్రమాదం కలిగించేవారిగా వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని తప్పు పట్టిది.
కేన్సస్ కాల్పులపై ట్రంప్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని న్యూయార్క్ టైమ్స్ గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేష నేరాలను ఖండించడంలో ట్రంప్ చురుగ్గా లేరని, అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి ఇదేరీతిలో ఉందని విమర్శించింది.. మెక్సికన్లు, ముస్లింలు, ఇతరులను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన తెస్తున్న విధానాలు, చేస్తున్న వ్యాఖ్యలు విద్వేషాలను పెంచిపోషించేవారికి శక్తినిస్తోందని అభిప్రాయపడింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషపూరిత నేరాలు, వివక్ష ఘటనలు పెరిగిపోయాయని చెప్పింది.. శ్రీనివాస్ హత్య దానికి కొనసాగింపేనని వ్యాఖ్యానించింది. కాన్సాస్ హంతకుడితో తలపడి, గాయపడిన 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిలాట్ నుంచి ట్రంప్ పాఠాలు నేర్చుకోవాలని న్యూయార్క్ టైమ్స్ సూచించింది. గ్రిలాట్ చెప్పిన మాటలను కూడా న్యూయార్క్ టైమ్స్ ఉటంకించింది.