కూచిభొట్లపై మూడుసార్లు కాల్పులు: అఫిడవిట్లో ఏం చెప్పారు?
ఉద్దేశ్యపూర్వకంగానే ఆడమ్ ప్యూరింటన్ తెలుగు ఇంజనీరు కూచిభొట్లను హత్య చేసినట్లు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను బట్టి అర్థమవుతోంది.
హైదరాబాద్: తెలుగు ఏవియేషన్ ఇంజనీరు శ్రీనివాస్ కూచిభొట్లపై ఆడమ్ ప్యూరింటన్ మూడు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్యూరింటన్ ఫిబ్రవరి 22వ తేదీన కాన్సాస్లోని బార్లో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా, అతని మిత్రుడు ఆలోక్ మాడసాని గాయపడిన విషయం తెలిసిందే.
జాన్సస్ కౌంటీ న్యాయమూర్తి ముందు ఆ ఘటనపై దాఖలు చేసిన అఫిడవిట్లో నేరం ఎలా జరిగిందనే విషయాన్ని వివరించారు. మూడు సార్లు కాల్పులు జరిపినట్లు తేలడాన్ని బట్టి ప్యూరింటన్ పక్కాగా 32 ఏళ్ల కూచిభొట్లను చంపాలనే ఉద్దేశంతోనే ఆ పనిచేసినట్లు అర్థమవుతోంది.
తెల్ల నేవీ టీ షర్ట్కు మెడల్స్ను అతికించుకున్న ప్యూరింటన్ కూచిభొట్లపై కాల్పులు జరిపిన సమయంలో స్క్వార్ఫ్ ధరించాడు. కూచిభొట్ల ఏ మాత్రం రెచ్చగొట్టకుండానే అతను కాల్పులు జరిపాడు. బార్లో తొలుత అతను కూచిభొట్లతోనూ ఆలోక్తోనూ వాగ్వివాదానికి దిగాడు. ఆ వాదనలో హత్య చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించలేదు.
అరగంట తర్వాత అతను తిరిగొచ్చి...
తెలుగు ఇంజనీర్లతో వాదానికి దిగిన తర్వాత వెళ్లిపోయిన ప్యూరింటన్ అర గంట తర్వాత తిరిగి వచ్చాడు. అతను గన్తో తిరిగివచ్చాడు. దాంతో బార్లోని వాళ్లంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వారంతా పెద్ద పెట్టున కేకలు వేశారు. నేరుగా వచ్చేసి కూచిభొట్లపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆలోక్కు గురి పెట్టి కాల్చాడు. పగతోనే అతను తిరిగి బార్లోకి వచ్చాడని దాన్ని బట్టి అర్థమవుతోంది.
అతను ఇలా అడిగాడు...
మీరు చట్టబద్దంగానే ఇక్కడ ఉంటున్నారా అని ప్యూరింటన్ తెలుగు ఇంజనీర్లను అడిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇయాన్ గ్రిల్లోట్ అడ్డుకోవడంతో పాటు మరో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో అతన్ని బయటకు పంపించారు. గ్రిల్లోట్ కూడా ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు.
పోలీసుల సంబాషణను బట్టి...
రేడియోలో పోలీసులు మాట్లాడుతున్న మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందనే విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. తెల్లటి పురుషుడు నల్లటి, తెల్లటి స్క్వార్ఫ్ను తల చుట్టూ కట్టుకుని వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపి పశ్చిమ దిశగా పారిపోతున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడి చేతిలో హ్యాండ్ గన్ ఉన్నట్లు అనుమానించారు.
పోలీసులు గుర్తించిన వైనం...
పోలీసులు అక్కడి సంఘటన వివరాలను వర్ణించారు. నిందితుడిని ఆడమ్గా గుర్తించారు. అతను తెల్లటి పురుషుడని కూడా గుర్తించారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జాత్యహంకార నేరంగా పరిగణించి ఎఫ్బిఐ కూడా సంఘటనపై దర్యాప్తు చేస్తోంది.